జైట్లీతో మాట్లాడా, బిజెపితో రాజీపడ్డానంటున్నారు, జరిగేది కాదు: బాబు
విజయవాడ: ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీతోనూ వెంకయ్య నాయుడితోనూ మాట్లాడానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారో స్పష్టత ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.
కేంద్రం నుంచి ఒక స్పష్టత వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటామని అరుణ్ జైట్లీకి వివరించినట్లు చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించాలని జైట్లీని కోరినట్లు బాబు తెలిపారు.
రాజకీయ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసు బయటకు తెచ్చిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజానాల విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను బిజెపితో రాజీపడినట్లు విమర్శలు చేస్తున్నారని, అది జరిగేది కాదని అన్నారు.
రాష్ట్ర విభజనపై బిజెపి నాయకులు ఆనాడు కాంగ్రెసును నిలదీశారని, ఇప్పుడు బిజెపి సమస్యను పరిష్కరించాలని ఆయనయ అన్నారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. ఇరు వర్గాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారని, దీంతో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి సాయంపై ఎప్పటికప్పుడు తాను కేంద్రంతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.