వ్యాపారమే కాదు: మంత్రి శిద్ధాకు బాబు క్లాస్, ఆ ఆస్తులపై జీ గ్రూప్ ఆసక్తి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి శిద్ధా రాఘవ రావుకు క్లాస్ పీకారని తెలుస్తోంది. శనివారం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి శిద్ధా రాఘవ రావుకు క్లాస్ పీకారని తెలుస్తోంది. శనివారం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శిద్ధా రాఘవరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మీరు వ్యాపారం బాగా చేస్తారని, దాంతో పాటు మీ శాఖను కూడా చూడండని ఎద్దేవా చేశారని తెలుస్తోంది. వ్యాపారమే కాదని, ఇదీ చూడాలన్నారు.

అడవులపై నుంచి వెళ్తా, బాధేస్తోంది
అటవీశాఖ పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం అనుకున్న మేర పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు హెలికాప్టర్లలో ప్రయాణించినా అడవుల మీదుగా వెళ్లేటప్పుడు చాలా పరిశీలనగా చూస్తానని, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం బాధ కలిగిస్తుందన్నారు.

నాతో పాటు వస్తే తెలుస్తుంది
తనతో హెలికాప్టర్లో వస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని అటవీశాఖ ముఖ్యకార్యదర్శితో చంద్రబాబు అన్నారు. కాంటూర్ కందకాల తవ్వకం లక్ష్యానికి అనుగుణంగా జరగడం లేదన్నారు. నీరు-చెట్టు కింద అవసరమైతే అటవీశాఖకు రూ.100 కోట్లు ఇస్తామన్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులపై సుభాష్ చంద్ర ఆసక్తి
ఇదిలా ఉండగా, అగ్రి గోల్డ్ ఆస్తులను వేలంలో విక్రయించి డిపాజిటర్లకు చెల్లించే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా జీ గ్రూప్ సంస్థల అధినేత సుభాష్ చంద్ర ఇటీవల తనను కలిసినప్పుడు ఒక ప్రతిపాదన చేశారని చంద్రబాబు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ నిర్దేశిత ధరకు తాము తీసుకుంటామని, వాటికి గిరాకీ వచ్చినప్పుడు తాము అమ్ముకుంటామని ప్రతిపాదించారని తెలిపారు.

అప్పుడే జీ గ్రూప్ ప్రతిపాదన పరిశీలన
కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద కూడా కొంత నిధుల్ని దీనికి వెచ్చిస్తామని సూచించినట్టు చంద్రబాబు చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తులకు వేలం వేసినా, ఆశించిన ధర రాని నేపథ్యంలో, డిపాజిటర్లకు మేలు జరుగుతుందనుకుంటే సుభాష్ చంద్ర ప్రతిపాదనను పరిశీలించవచ్చని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications