ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగికదాడి యత్నం.. కేకలు వేయడంతో
మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్న నో యూజ్.. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉ్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులకు మరణ శిక్షలు విధించినా.. ఎన్కౌంటర్లు చేసినా.. మృగాళ్లలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అత్యాచారాలు ఆగడం లేదు. రోజు ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో గల సీతానగరం పుష్కరఘాట్ దగ్గర ప్రేమజంటపై దాడి చేశారు. యువతిపై అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలో గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు నగర శివారులో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తున్న విద్యార్థినిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో వారు పారిపోయారు. తాడికొండ మండల పరిధి మోతడకలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న యువతి తన స్నేహితుడితో కలిసి గురువారం గుంటూరుకు బయల్దేరింది. ప్రయాణ సమయంలో కాసేపు రోడ్డు పక్కన ఆగారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు యువకులు కర్రలతో వారిపై దాడి చేశారు. యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. యువతి కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
బాధిత యువతి, ఆమె స్నేహితులు శనివారం తాడికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. విద్యార్థినిపై అత్యాచారయత్నం స్థానికంగా కలకలం రేపింది. మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఆడపిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది.