బతుకమ్మ చీరల పంపిణీ రేపట్నుంచే: రూ. 300 కోట్లకుపైగా ఖర్చు, కోటికిపైగా చీరలు
హైదరాబాద్: బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ ఆడపడుచులకు రేపట్నుంచి అంటే గురువారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చీరలు పంచుతున్న విషయం తెలిసిందే.
పూల పండుగ బతుకమ్మను తెలంగాణ మహిళలు ఘనంగా నిర్వహిస్తారు. గత కొద్ది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను సారెలుగా అందిస్తుంది. సెప్టెంబర్ 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమై.. తొమ్మిది రోజుల పాటు వైభవంగా కొనసాగుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కింది.
ప్రతి ఏడాదిలాగే బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కూడా భారీగా ఖర్చు చేస్తోంది. మొత్తం 339.73 కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ సర్కారు ఇప్పటికే తెలిపింది. ఇప్పటికే కోటి చీరలను సిద్ధం చేసింది. వాటిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా తరలించింది. 10 రకాల రంగుల్లో ఆయా చీరలు ఉన్నాయి. మొత్తం 24 విభిన్న డిజైన్లతో, 240 రకాల త్రేడ్ బోర్డర్లతో రూపొందించారు.
గురువారం పలు జిల్లాల్లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు బతుకమ్మ చీరల పంపీణీ చేస్తారు. ఈ సందర్భంగా బుధవారం కేటీఆర్ స్పందిస్తూ... 'తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బతుకమ్మ చీరల పంపిణీ రేపటి నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు. అంతేగాక, తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించాం అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీర అందిస్తామని తెలిపారు.