ట్విస్ట్: మెట్టుదిగిన పన్నీరు, పళనికే సీఎం: అన్నాడీఎంకే విలీనం!
అన్నాడీఎంకేలో పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం పైనుంచి దిగేందుకు పళనిస్వామి వర్గం ససేమీరా అంటోంది. పన్నీరుసెల్వం సీఎం పీఠం కోసం పట్టుబడుతున్నారు.
చెన్నై: అన్నాడీఎంకేలో పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం పైనుంచి దిగేందుకు పళనిస్వామి వర్గం ససేమీరా అంటోంది. పన్నీరుసెల్వం సీఎం పీఠం కోసం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విలీన అంశం వెనక్కి జరిగింది.
అక్కడే విలీనం ఫెయిల్, పళని దాటవేత: కేంద్రంపై వీరమణి సంచలనం
అయితే, శుక్రవారం మరో కొత్త ట్విస్ట్. ఇరువర్గాలు కూడా రాజీ సూత్రానికి వచ్చాయని తెలుస్తోంది. పన్నీరు - పళనివర్గాల మధ్య చర్చలు రహస్యంగా జరిగాయని తెలుస్తోంది. వారి మధ్య ఓ రాజీ కుదిరిందని తెలుస్తోంది. దీంతో విలీనం సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు.
త్వరలో ప్రకటన.. పళనికి సీఎం, పన్నీరుకు పార్టీ చీఫ్
ఇరువర్గాల మధ్య రహస్య సమావేశాలు జరిగి, ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఈ రోజు లేదా రేపు ఇరువర్గాలు కలిసి ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సమాచారం మేరకు... పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి అలాగే ఉంటుంది. పన్నీరుసెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటారు. ఈ ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
పన్నీరు వ్యూహం రివర్స్
శశికళ జైలుకు వెళ్లడం, దినకరన్ లంచం చిక్కుల్లో ఇరుక్కోవడంతో పన్నీరుసెల్వం వర్గం వేగంగా పావులు కదిపింది. పార్టీని, ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.
మెట్టుదిగిన పన్నీరుసెల్వం వర్గం
పార్టీని పన్నీరుకు అప్పగించేందుకు పళనిస్వామి వర్గం ముందుకు వచ్చింది. కానీ పళనిస్వామియే సీఎంగా ఉండాలని పట్టుబట్టింది. పన్నీర వర్గం మాత్రం రెండూ తమ చేతుల్లోనే ఉండాలని కోరుకుంది. అయితే, పళని వర్గం బెట్టు వీడకపోవడంతో ఎట్టకేలకు పన్నీరువర్గం ఓ మెట్టు దిగింది.
తన వర్గంతో పన్నీరు భేటీ
శుక్రవారం నాడు పన్నీరుసెల్వం తవ వర్గం నేతలతో భేటీ అయ్యారు. గురువారం నాటి పరిణామాలపై చర్చించారు. అనంతరం పార్టీ పగ్గాలు తమకు అప్పగించేందుకు పళనిస్వామి వర్గం ముందుకు రావడంపై చర్చ జరిగిందని తెలుస్తోంది.
పళనిస్వామి ఓకే.. చిన్న ఇష్యూలపై..
శశికళ కుటుంబాన్ని దూరం పెట్టాలని, జయలలిత మృతిపై విచారణ జరిపించాలని.. ఇలా పలు డిమాండ్లను పన్నీరుసెల్వం.. పళనిస్వామి వర్గం ముందు ఉంచింది. వారి భేటీలో.. అన్ని అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.
పెద్ద విషయాలపై ఒప్పందం కుదరగా, చిన్న చిన్న అంశాలపై చర్చిద్దామని నిర్ణయించారని తెలుస్తోంది. మొత్తానికి అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఒక్కటయ్యాయని, అధికారికంగా వెలువడటమే ఆలస్యం అంటున్నారు. అయితే, శశికళ కుటుంబాన్ని పక్కన పెట్టాలన్న తన పట్టుదలను పన్నీరు నెరవేర్చుకున్నారని అంటున్నారు.