వివాదాస్పద వ్యాఖ్యలు: పార్లమెంటులో క్షమాపణలు చెప్పిన హెగ్డే
న్యూఢిల్లీ: రాజ్యాంగం, లౌకికవాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో కేంద్రమంత్రి అనంత్కుమార్ హెగ్దే గురువారం లోక్సభలో క్షమాపణలు చెప్పారు. ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే తనను క్షమించాలని కోరారు.
'నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజ్యాంగం, పార్లమెంట్, బాబా సాహెబ్ అంబేడ్కర్ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. రాజ్యాంగమే మనకు సుప్రీం అని నమ్ముతాను. ఓ భారత పౌరుడిగా దానికి వ్యతిరేకంగా నేను ఏమీ చేయను. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే వారికి నేను క్షమాపణ చెబుతున్నాను' అని హెగ్డే అన్నారు.

ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ సమావేశంలో హెగ్డే మాట్లాడుతూ.. ఎవరైనా సరే వారి మతంతో గుర్తింపు కలిగి ఉండాలని, తమ తల్లిదండ్రులెవరో తెలియని కొందరు లౌకికవాదం గురించి మాట్లాడతారని వ్యాఖ్యానించారు. అంతేగాక, రాజ్యాంగాన్ని మారుస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు.
హెగ్డే వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ ఉభయసభల్లో బుధవారం జరిగిన సమావేశంలో విపక్ష సభ్యులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. హెగ్డేను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో హెగ్డే గురువారం సభలో క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లయింది.












Click it and Unblock the Notifications