ఆపిల్ ఐఫోన్ల తయారీ బెంగళూరులోనే : అధికారిక ప్రకటన
అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ భారత్ లో ఐఫోన్ల తయారీపై తొలిసారిగా అధికారికంగా ప్రకటన వెలువడింది.
బెంగళూరు: అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ భారత్ లో ఐఫోన్ల తయారీపై తొలిసారిగా అధికారికంగా ప్రకటన వెలువడింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి బెంగళూరులో ఈ కంపెనీ ఐఫోన్ల తయారీ ప్రారంభించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
సాఫ్ట్ వేర్ సిటీ బెంగళూరులో తైవాన్ కి చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ మరో రెండు నెలల్లో ఫోన్ల తయారీ ప్రారంభిస్తుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే వెల్లడించారు. ఆపిల్ ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్(ఓఈఎం)గా ఉన్న విస్ట్రన్ కార్పొరేషన్.. ఐఫోన్ల తయారీ వ్యవహారాలను చూస్తుంటుంది.
ఆపిల్ ఐఫోన్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు ప్రియా బాలసుబ్రహ్మణ్యం, ఐఫోన్ ఆపరేషన్స్ డైరెక్టర్ ధీరజ్ చుగ్, ప్రభుత్వ వ్యవహారాల సీనియర్ మేనేజర్ అలీ ఖనాఫర్ తదితరులతో కర్ణాటక మంత్రులు, అధికారులు సమావేశమైనట్లు మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్లు తయారు చేస్తున్న మూడు దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని ప్రియాంక ఖర్గే తెలిపారు.