కరోనా తగ్గిందా ? పరీక్షలు తగ్గాయా ? టెస్టులు తగ్గించి కరోనా తగ్గుతున్నట్లు చూపుతున్న ప్రభుత్వాలు..
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం భారీగా తగ్గుతున్నట్లు రోజువారీ ప్రభుత్వ హెల్త్ బులిటెన్లు చెబుతున్నాయి. దీంతో గత పది నెలలుగా కరోనా పేరు చెబితేనే వణుకుతున్న జనం కాస్త ఊరట లభించిందని భావిస్తున్నారు. ఈ భ్రమలోనే కరోనా టెస్టులు జరుగుతున్నాయో లేదో కూడా పట్టించుకోని పరిస్ధితి చాలా రాష్ట్రాల్లో కనిపిస్తోంది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల్లో కరోనా టెస్టుల నిర్వహణ తూతూ మంత్రంగా మారిపోయినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అంటే కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వాలు మొగ్గుచూపడం లేదు. కానీ కరోనా తగ్గినట్లు రోజువారీ ప్రకటనలు మాత్రం చేసి చేతులు దులుపుకుంటున్నాయి.
ఈసారికి పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు ? కరోనా భయాలతో- గతంలోనూ ఇలాగే...
కరోనా నిజంగానే తగ్గుతోందా ?
దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య తాజాగా 30 వేల కంటే తక్కువగానే ఉంటోందని కేంద్రం చెబుతోంది. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన రోజువారీ సమాచారం ఆధారంగా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ లెక్కలను విడుదల చేస్తోంది. వీటిని చూసిన వారెవరికైనా కరోనా నిజంగానే తగ్గిపోతోందా అని అనిపిస్తోంది. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్ధితి మాత్రం ఇంకా కుదుటపడలేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న దానికీ, క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితికీ మధ్య చాలా రాష్ట్రాల్లో భారీ వ్యత్యాసం కూడా ఉంటోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోయినప్పటికీ కేంద్రం, రాష్ట్రాల సమాచారం ఆధారంగా ఈ నివేదికలు విడుదల చేస్తోందన్న మాట.
భారీగా తగ్గిపోయిన పరీక్షలు..
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతున్నా గత కొద్ది నెలలుగా కరోనా పరీక్షలను మాత్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేసినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రోజువారీ నిర్వహించాల్సిన కరోనా పరీక్షల సంఖ్య భారీగా పడిపోతున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గిందన్న ప్రచారం మధ్య ప్రభుత్వాలు కూడా కచ్చితంగా నిర్వహించాల్సిన పరీక్షలను కూడా నిర్వహించకుండా అలసత్వం చూపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొదట్లో కరోనాను సీరియస్గా తీసుకుని ఆస్పత్రులను కరోనా సెంటర్లుగా మార్చిన ప్రభుత్వాలు ఇప్పుడు తిరిగి వాటిని రెగ్యులర్ ఆస్పత్రులుగా మార్చేస్తున్నాయి.
ఆర్టీ పీసీఆర్ను కాదని ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు..
కచ్చితంగా ఫలితాన్నిస్తాయని పేరున్న ఆర్టీ పీసీఆర్ పరీక్షలను కాదని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలవైపే మొగ్గుచూపుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఖర్చుతో కూడిన ఆర్టీ పీసీఆర్ టెస్టుల కంటే చౌకగా పూర్తయ్యే ర్యాపిడ్ కిట్ పరీక్షలను నిర్వహించి ఖర్చు తగ్గించుకునేందుకు ప్రభుత్వాలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో రోజువారీ నిర్వహించే మొత్తం పరీక్షల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల శాతమే ఎక్కువగా ఉంటోంది. వీటి ద్వారా వైరస్ తీవ్రత తేలకపోవడంతో నిజంగానే కరోనా తగ్గిందన్న భావన వ్యక్తమవుతోంది. వైరస్ ప్రభావం ముదిరాక తిరిగి పరీక్షలకు జనం రావడం వెనుక కారణం కూడా ఇదే.
వారంలోనే రెండు లక్షల టెస్టులు తగ్గాయ్...
వారం క్రితం వరకూ ప్రతీ రోజూ దేశవ్యాప్తంగా 11 లక్షల పరీక్షల వరకూ చేస్తుండగా.. తాజాగా ఆ సంఖ్య 9 లక్షలకు తగ్గిపోయింది. అంటే వారం రోజుల వ్యవధిలోనే రెండు లక్షల టెస్టులు తగ్గించేశారన్నమాట. ఆ మేరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. వాస్తవానికి అక్టోబర్ 22న దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల శాతం 9.1గా ఉండగా.. ఇప్పుడు అది కాస్తా 4.2 శాతానికి చేరుకుంది. అత్యధిక పాజిటివ్ కేసులున్న రాష్ట్రాలు మరింత ఎక్కువగా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. తగ్గిస్తూ పోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజస్ధాన్, ఢిల్లీ వంటి పెద్ద రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 13 శాతంగా నమోదవుతోంది. అయితే ఇక్కడ చేస్తున్న టెస్టుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఇందులోనూ ర్యాపిడ్ టెస్టులే 70 శాతం ఉండటం ఆందోళన రేపుతోంది.
ఈ రాష్ట్రాల్లో దారుణ పరిస్ధితులు..
ఢిల్లీ, రాజస్ధాన్, హర్యానా, కేరళ, కర్నాటకలో కరోనా పరిస్ధితులు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే ఇక్కడ నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్య మాత్రం తగ్గిపోతోంది. చేస్తున్న పరీక్షల్లోనూ ర్యాపిడ్ పరీక్షలే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ పరిస్ధితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఇక్కడ కూడా ర్యాపిడ్ టెస్టుల మీదే ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీంతో కేసులు కూడా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వాస్తవ పరిస్దితులు చూస్తే వేరుగా ఉంటున్నాయి. మొత్తం మీద వీరంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా అర్ధమవుతోంది.