7వ తేదీ నుంచి వందశాతం ఆఫీసులు ఓపెన్: గుజరాత్ ప్రభుత్వం
గుజరాత్ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్నివారాలుగా గణనీయంగా తగ్గాయి. గుజరాత్ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. జూన్ 7వ తేదీ నుంచి 100శాతం సిబ్బందితో ఆఫీసుల్లో పనిచేయడానికి అనుమతించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసుల్లో జూన్ 7 నుంచి వంద శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించిందని గుజరాత్ సమాచార విభాగం పేర్కొంది.
ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసుల్లో 50 మంది సిబ్బందితో మాత్రమే గుజరాత్లో పనిచేస్తున్నారు. వైరస్ వ్యాప్తి అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మంది సిబ్బందితో మాత్రమే అనుమతినిచ్చింది. గత రెండు వారాల్లో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. దాంతో వంద శాతం సిబ్బందికి అనుమతినిస్తున్నట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటికే షాపులను తెరిచేందుకు అనుమతించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని 36 నగరాల్లోని అన్ని దుకాణాలను శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరవడానికి అనుమతించారు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్ల ద్వారా హోమ్ డెలివరీ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో దాదాపు లాక్ డౌన్ నిబంధనలు సడలించినట్టే.. రాత్రి పూట కర్ఫ్యూ కూడా నామమాత్రంగా కొనసాగే అవకాశం ఉందిజ
గుజరాత్ లాక్డౌన్ జూన్ 11వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ పరిమితులను మాత్రం సడలించింది. నైట్ కర్ఫ్యూను జూన్ 4 నుండి జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్లు సీఎంఓ ప్రకటించింది. గురువారం 1,207 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,13,270 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పుడు 24,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 17 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 9,890కు చేరుకుంది.