పీఎస్ఎల్వీ సీ42 విజయవంతం: యూకే ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో
Recommended Video
నెల్లూరు: పీఎస్ఎల్వీ సీ42 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. బ్రిటన్కు చెందిన నోవాసర్, ఎస్ 1-4 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. ఈ రెండు ప్రయోగాలు భూమిని పరిశీలించనున్నాయి. ప్రయోగం విజయవంతంకావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ శివన్ అభినందించారు.
ఈ రాకెట్ 17.45 నిమిషాలకు 583 కి.మీ. ఎత్తుకు చేరుకుంది. భూమధ్యరేఖకు 97.80 డిగ్రీల వాలులో 140 డిగ్రీల దిగాంశంపై సూర్య సమస్థితి కక్ష్యలో 483 కిలోల నోవాసర్ ఎస్, 444 కిలోల ఎస్1-4 ఉపగ్రహాలను విడిచింది. ఇప్పటి వరకు 243 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీని పంపడం 33వసారి.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం రాత్రి పీఎస్ఎల్వీ సీ42 ద్వారా ఈ రెండు ఉపగ్రహాలను పంపించారు. భూమి పరిశీలన, వరదలు, విపత్తుల సమాచారం ఇచ్చేందుకు ఉపయోగపడతాయి.
శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరంతరాయంగా 33 గంటల పాటు కొనసాగింది. ఆదివారం రాత్రి గం.10.08 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ సి42 రాకెట్ రూపకల్పనకు రూ.175 కోట్లు వరకు వ్యయం చేశారు. ఇది నాలుగు దశల రాకెట్. దీని పొడవు 44.4 మీటర్లు. ప్రయోగ సమయంలో బరువు 230.4 టన్నులు.