బిజెపిపై అలక: స్వతంత్ర అభ్యర్థిగా జశ్వంత్ నామినేషన్
జైపూర్: తాను కోరిన చోటి నుంచి పోటీ చేసేందుకు తన పార్టీ అగ్రనాయకత్వం అంగీకరించకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా లోకసభ బరిలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మర్ లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
తన సొంత నియోజకవర్గమైన బర్మర్ నుంచి తనకు లోకసభ టికెట్ కావాలని జశ్వంత్ సింగ్ బిజెపి అధిష్టానాన్ని పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, స్థానిక బిజెపి నాయకత్వం ఒత్తిడి మేరకు బిజెపి అగ్రనాయకత్వం ఇటీవల బిజెపిలో చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కాల్నల్ సోనరాం చౌధరిని బర్మర్ నియోజకవర్గం నుంచి పోటీకి దించాలని నిర్ణయించింది.
దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జశ్వంత్ కంటతడి కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం పార్టీ మొత్తం బయటివారితో నిండిపోయిందని, నిజమైన బిజెపి పోయి నకిలీ బిజెపి తయారవుతోందని శనివారం జశ్వంత్ ఆరోపించారు. అంతేగాక ఆయన బిజెపిని వీడే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం సాగింది.
అయితే జశ్వంత్ సింగ్ సోమవారం బర్మర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాను ఇలా చేయాలనుకోలేదని, తన అభిమానులు, కార్యకర్తల కోసమే నామినేషన్ వేశానని ఈ సందర్భంగా జశ్వంత్ తెలిపారు. తనను బిజెపి అధిష్ఠానం మోసం చేసిందని, నకిలీ బిజెపిగా మారిందని ఆరోపించారు. కాగా, జశ్వంత్ సింగ్ 2009 లోకసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఇటీవల కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఎస్ఎస్ అహ్లూవాలియా బరిలో దిగనున్నారు.