పేలుళ్లలో 6గురి మృతి, రంగంలోకి ఎన్ఐఏ: మోడీ షాక్
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం సంభవించిన వరుస పేలుళ్లలో ఆరుగురు మృతి చెందారు. పాట్నాలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సభకు మూడు గంటల ముందు ఈ పేలుళ్లు ప్రారంభమయ్యాయి. రెండు గంటలన్నర వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించాయి.
మొదట పాట్నా రైల్వే స్టేషన్ పదో నెంబరు ప్లాట్ ఫాం వద్ద ఓ నాటు బాంబు పేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టాయిలెట్తో పాటు మరోచోట రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. గంటన్నర తర్వాత థియేటర్ వద్ద మరో పేలుడు సంభవించింది.
ఆ తర్వాత మోడీ పాట్నాలో అడుగు పెట్టాక మరో నాలుగైదు పేలుళ్లు జరిగాయి. అందులో మోడీ హూంకర్ ర్యాలీ జరుగుతున్న గాంధీ మైదానం ప్రాంతంలో ఆరు నాటు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఐదుగురు మృతి చెందగా, ఇరవై మంది వరకు గాయపడ్డారు. మొత్తం ఆరు నుండి ఎనిమిది పేలుళ్లు జరిగినట్లుగా తెలుస్తోంది. పేలుళ్ల విషయం తెలిసిన నరేంద్ర మోడీ షాక్ అయ్యారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
రంగంలోకి ఎన్ఐఏ, ఎన్ఎస్జి
నాటు బాంబు పేలుళ్ల నేపథ్యంలో జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఎన్ఐఏ బృందం పాట్నాకు బయలుదేరింది. ఎన్ఎస్జి కూడా రంగంలోకి దిగింది. పాట్నాలో పేలినవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులుగా గుర్తించారు.
పేలుళ్లపై ఖండన
పాట్నా పేలుళ్లను రాజకీయ నాయకులు ఖండించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాట్నా పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఫోన్ చేసి దర్యాఫ్తు చేయించాలని సూచించారు. నితీష్ కుమార్ ఉన్నతాధికారులతో పేలుళ్ల విషయమై చర్చించారు.
పాట్నా పేలుళ్లపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. మోడీ ర్యాలీ సమయంలో పాట్నా పేలుళ్లు నితీష్ కుమార్ ప్రభుత్వానికి సవాల్ అన్నారు. పేలుళ్లకు పాల్పడిన వారిని ప్రభుత్వం పట్టుకోవాలన్నారు.
బిజెపి, ఆర్జేడి పేలుళ్లను తీవ్రంగా ఖండించాయి. పేలుళ్ల వెనుక ఎవరున్నారో విచారణ చేయించాలని బిజెపి డిమాండ్ చేయగా, ఆర్జేడి నితీష్ కుమార్ ప్రభుత్వం వైఫల్యమని మండిపడింది. పాట్నా పేలుళ్లను శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల సభలో కూడా బాంబులు పేలాయంటే కేంద్ర ప్రభుత్వ పాలన ఏలా ఉందో అర్థమవుతోందన్నారు.