దోస్త్ మేరా దోస్త్ : లాలూతో మళ్లీ చేయి కలపనున్న నితీష్ కుమార్..?
ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసిన నితీష్ కుమార్ తిరిగి లాలూ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారా...? బీజేపీతో చేతులు కలిపి నితీష్ కుమార్ ఇమడలేకున్నారా...? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. మహాఘట్ బంధన్ నుంచి ఏడాది క్రితం బయటకు వచ్చేసిన నితీష్ కుమార్... తిరిగి అదే గూటికి వచ్చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నితీష్ వైపు నుంచి అతని సన్నిహితులు లాలూతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సన్నిహితుల మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. గతనెలలో ముంబైలో జరిగిన ఇఫ్తార్ విందులో నితీష్ సన్నిహితులు పాల్గొని యూపీఏలో చేరేందుకు ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం ఆర్జేడీతో నితీష్ కుమార్ ఎందుకు తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చిందో ఆ సమావేశంలో నితీష్ ప్రతినిధులు వివరించారట. అంతేకాదు కాంగ్రెస్తో చర్చలు జరిపేందుకు నితీష్ వర్గం సిద్దంగా ఉందన్న సంకేతాలు ఆర్జేడీ నేతలకు పంపినట్లు తెలుస్తోంది.
"అవును ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి నిర్ణయాలను తేలిగ్గా తీసుకోలేము. ఎన్నో చర్చలు జరగాలి ఇరు వర్గాలు సంతృప్తి చెందాలి. ఈ వ్యవహారం చాలా ఉంది. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు నితీష్ కుమార్ తిరిగి యూపీఏలో చేరేందుకు చర్చలు మాత్రం జరిగాయని నేను కచ్చితంగా చెప్పగలను"అంటూ నితీష్ కుమార్ సన్నిహితుడు ఒకరు తెలిపారు.
బీజేపీ జేడీయూల మధ్య సఖ్యత సరిగ్గా లేదని మాత్రం స్పష్టమైన సంకేతాలున్నాయి. ఇందుకు నిదర్శనం మొన్న జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వంలోని అన్ని పార్టీలు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపగా ఒక్క నితీష్ కుమార్ మాత్రమే ఎలాంటి హంగామా చేయలేదు. అంతేకాదు కొంత కాలంగా నితీష్ కుమార్ బీజేపీపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారు. బీహార్కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూనే.. అస్సాం పౌరసత్వ బిల్లుపై, పెద్ద నోట్ల రద్దుతో వచ్చిన ఇబ్బందులపై నితీష్ మాట్లాడుతూ బీజేపీని ఇరుకున పెడుతున్నారు.
ఇదిలా ఉంటే... నితీష్ కుమార్ ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం జరిగాక నితీష్ను మళ్లీ యూపీఏలోకి ఆహ్వానించేందుకు ఆర్జేడీ సిద్ధంగా లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నితీష్ గ్రాఫ్ పడిపోతుందని గ్రహించారు కాబట్టే తిరిగి యూపీఏలో చేరేందుకు నితీష్ ఆపసోపాలు పడుతున్నారని ఆర్జేడీ నేతలు ఎద్దేవా చేశారు. లాలూ తనయుడు మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ కూడా నితీష్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారు. నితీష్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నితీష్ బీజేపీతో చేతులు కలిపి లాలూ కుటుంబంపై సీబీఐని ఉసిగొల్పడం క్షమించరానిదని ఆర్జేడీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
మరోవైపు వచ్చే లోక్సభ ఎన్నికల సమయానికి బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసి పోవాలని కాంగ్రెస్ ఆశపడుతున్నప్పటికీ బీహార్లో మాత్రం ఆర్జేడీని కాదని కాంగ్రెస్ అడుగు ముందుకేయలేని పరిస్థితి తలెత్తింది. నితీష్ కంటే కాంగ్రెస్కు లాలూ ప్రసాద్ యాదవే ఎక్కవని, లాలూ తిరిగి నితీష్ను ఆహ్వానిస్తే అందుకు కాంగ్రెస్కు సమ్మతమేనని లేదంటే నితీష్ మరికొంత కాలం వేచిచూడాల్సిందేనని ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.