టాయ్లెట్కు మరణానికి లింకు?: బీహార్ ప్రజల వింత వాదన..
ఇంట్లో టాయ్లెట్ నిర్మిస్తే.. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మృత్యువాత పడుతారని బీహార్ లోని ఘాజిపూర్ ప్రజలు విశ్వసిస్తున్నారు.
పాట్నా: ఓవైపు దేశవ్యాప్తంగా బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే.. బీహార్ లోని కొన్ని చోట్ల మూఢవిశ్వాసాలు ఈ ప్రయత్నానికి అడ్డుపడుతున్నాయి. బీహార్ లోని ఘాజిపూర్ ప్రజలు చెబుతున్న వింత మాటలు వింటే.. అక్కడి ప్రజలు ఎంత గుడ్డి నమ్మకాలను పాటిస్తున్నారో అర్థమవుతుంది.
ఇంట్లో టాయ్లెట్ నిర్మిస్తే.. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మృత్యువాత పడుతారని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎప్పుడో 1984లొ, 1996లో జరిగిన రెండు ఘటనలే ఇప్పటికీ వాళ్లను భయపెడుతున్నాయి. 1994లో గ్రామానికి చెందిన సిద్ధేశ్వర్ సింగ్ అనే రైతు తన ఇంట్లో టాయ్లెట్ నిర్మిస్తున్న సమయంలో.. అతని పెద్ద కొడుకు ఏదో వ్యాధితో మరణించాడు.
ఆ తర్వాత ఇదే గ్రామానికి చెందిన మరో రైతు 1996లో.. తన ఇంట్లో టాయ్లెట్ నిర్మిస్తున్న సమయంలోనే కొడుకును పోగొట్టుకున్నాడు. దీంతో టాయ్లెట్ నిర్మించడం అశుభం లాంటిదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. టాయ్లెట్ నిర్మించి తమ కుటుంబ సభ్యులను దూరం చేసుకోలేమని అశాస్త్రీయంగా వాదిస్తున్నారు.
ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని ప్రభుత్వం చెబుతుంటే.. వద్దంటే వద్దని ఘాజీపూర్ గ్రామస్తులు వింత వాదన వినిపిస్తుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎవరెన్ని చెప్పినా.. టాయ్లెట్లు నిర్మించుకుని పిల్లలను దూరం చేసుకోలేమని అక్కడి గ్రామస్తులు ఖరాఖండిగా చెబుతున్నారు.