ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన: మోడీ మన్ కీ బాత్ అవసరం లేదంటూ రైతులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 72వ 'మన్ కీ బాత్' కార్యక్రమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన చేస్తామంటున్న రైతులు.. నేడు భోజనపు పళ్లాలని, డబ్బాలను మోగించి నిరసన తెలిపారు. దీంతో ప్రధాని మోడీ మన్ కీ బాత్ సందేశం తమకు చేరదని అన్నారు.
మోడీ మన్ కీ బాత్ ప్రసంగాలు విని తాము అలసిపోయామని రైతులు వ్యాఖ్యానించారు. ఇకనైనా తమ గోడును వినాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో కూడా పలువురు నెటిజన్లు మోడీ మన్ కీ బాత్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. మరికొందరు మోడీ మన్ కీ బాత్ యూ ట్యూబ్ వీడియోలకు డిస్లైక్లు కొట్టారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో వారు ఉద్యమిస్తున్న సింఘు, టిక్రీ, ఝాజీపూర్ ప్రాంతాల్లో పోలీసులు పహారా కొనసాగిస్తున్నారు. రైతులు రహదారులను దిగ్భంధించడంతో ఢిల్లీ ప్రజలకు, ఇతర ప్రాంతాల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.
మరోవైపు బురాడీలోని నిరంకారీ సమగం మైదానంలో ఆందోళన చేస్తున్న రైతులు అక్కడే పంటను నాటి నిరసన తెలిపారు. ఇది ఇలావుంటే, డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే, తాము లేవనెత్తిన నాలుగు ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించాలని షరతులు పెట్టాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్కు కిసాన్ మోర్చా శనివారం సాయంత్రం లేఖ రాసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు డిసెంబర్ 30న కుంద్లి-మనేసర్-పల్వాల్ రహదారిపై ట్రాక్టర్ల ర్యాలీకి నిర్ణయించింది.
ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ విఫలమైన విషయం తెలిసిందే. స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ పిలుపు మేరకు రైతులు ప్టేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. మన గోడు వినని ప్రధాని మాటల్ని వినాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, కరోనా లాక్డౌన్ ప్రారంభమైన సమయంలో ఆరోగ్యరంగంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవల గౌరవార్థం ప్రధాని మోడీ చప్పట్లు కొట్టాలని, ప్లేట్లతో చప్పుడు చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదే తీరున రైతులు నేడు నిరసన తెలిపారు.