రూ.80 కోట్ల పాత నోట్ల కట్టలు.. పరుపులా పేర్చి.., చివరికి పట్టుబడ్డారు!
కాన్పూర్: పాత నోట్లును రద్దు చేసి ఏడాది దాటినా ఇప్పటికీ పెద్ద మొత్తంలో పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో సుమారు రూ.80 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. కాన్పూర్లో ఓ వ్యక్తి నివాసంలో రద్దు అయిన పాతనోట్లు భారీగా ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు జరిపారు.

జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ), ఉత్తర ప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో పాత నోట్ల కట్టలు దొరికాయి. కాన్పూర్లోని స్వరూప్ నగర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఈ నోట్ల కట్టలను ఒక పెద్ద పరుపులా పరిచి ఉంచారు.
ఈ సందర్భంగా పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేస్తామని చెప్పిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. స్వరూప్ నగర్లోనే ఉన్న ఓ హోటల్ నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. రద్దయిన పాత నోట్లను అక్రమంగా వీరు మార్చాలనుకున్నట్లు తెలుస్తోంది.
స్వాధీనం చేసుకున్న నోట్ల విలువ దాదాపు రూ.80కోట్ల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మొత్తంపై పూర్తి వివరాలను రిజర్వు బ్యాంకు, ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం తెలియజేస్తుందని పోలీసులు తెలిపారు.
అరెస్ట్ చేసిన వ్యక్తుల పేర్లను కూడా పోలీసులు వెల్లడించలేదు. దీని వెనుక ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందా?.. అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications