‘సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు’.. ఏమిటవి? సీజేఐ జోక్యం మితిమీరుతోందా?
న్యూఢిల్లీ: దేశ న్యాయ చరిత్రలోనే అరుదైన ఘట్టం.. అత్యున్నత న్యాయస్థానం సిట్టింగ్ జడ్జిల విషయంలో చోటుచేసుకుంది. నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు శుక్రవారం ఉమ్మడిగా ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Recommended Video
సుప్రీం కోర్టులోనూ మహిళల పట్ల వివక్ష! 67 ఏళ్లలో ఆరుగురే మహిళా న్యాయమూర్తులు!
జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్లు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో 'అవాంఛనీయ సంఘటనలు' చోటు చేసుకుంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని నెలలుగా కేసుల కేటాయింపులు, పరిపాలనా విధానం గాడితప్పాయని, జరగకూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని న్యాయమూర్తులు విమర్శించారు. తమ ప్రయత్నాలు విఫలమైన తర్వాత తప్పని పరిస్థితుల్లోనే తాము మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
అవాంఛనీయ ఘటనలా.. ఏమిటవి?
జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు సుప్రీం న్యాయమూర్తులు చేసిన ఆరోపణలన్నీ.. నేరుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ దీపక్ మిశ్రాపై ఎక్కుపెట్టినవే. 2017 ఆగస్టులో జిస్టిస్ దీపక్ మిశ్రా సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాు. ఆ తరువాత కొద్దిరోజులకే ‘యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం' కేసులో అనూహ్యంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేశారు. అంతేకాదు, ‘సుప్రీంకోర్టుకు సీజేఐనే మాస్టర్' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలో ‘కేసులు, ధర్మాసనాల పరిధి తదితర అన్ని అంశాల్లో ప్రధాన న్యాయమూర్తిదే సంపూర్ణ అధికారం' అని కూడా తేల్చేశారు.
జడ్జి అవినీతి ఆరోపణల కేసులో...
అంతకు ఒకరోజు ముందే ‘జడ్జి అవినీతి ఆరోపణల కేసు'ను విచారిస్తోన్న రాజ్యాంగ బెంచి నుంచి జస్టిస్ చలమేశ్వర్ను సీజేఐ దీపక్ మిశ్రా తప్పించారు. గతేడాది నవంబర్లో చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రెస్మీట్లో జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. ‘‘ఆయా వివాదాల విషయంలో ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తిని కోరాం. ఇవాళ ఉదయం కూడా ఆయనను కలిశాం. అయినాసరే ఆశించిన ఫలితం రాకపోవడంతో లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం..'' అని వ్యాఖ్యానించారు.
ఆ రెండు కేసుల కారణంగానేనా?
సుప్రీంకోర్టుకు సంబంధించి వెలుగులోకి రాని వివాదాల సంగతి పక్కనబెడితే, శుక్రవారం నాటి నలుగురు న్యాయమూర్తుల ప్రెస్మీట్కు ప్రధాన కారణం.. జస్టిస్ చలమేశ్వర్ను ఓ రెండు కేసుల విచారణ నుంచి తొలగించడమే అని చెప్పొచ్చు. పైగా ఈ రెండు కేసులూ పరస్పరం సంబంధం ఉన్నవి. ఒకటి - యూపీలో మెడికల్ సీట్ల కుంభకోణం కాగా.. రెండోది - ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్పై అవినీతి ఆరోపణలకు సంబంధించినది.
ఇదీ మెడికల్ సీట్ల కుంభకోణం...
యూపీలోని లక్నో కేంద్రంగా నడిచే ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు చెందిన మెడికల్ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్ కాలేజీల్లో సరైన వసతులు లేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఆ కాలేజీల్లో అడ్మిషన్లు రద్దు చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కాలేజీలకి అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొంతమంది కాలేజీ యాజమాన్యాలతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సీబీఐ.. డీల్స్ కుదుర్చుకున్నది ఎవరోకాదు.. సాక్షాత్తు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖద్దూసీ(2004-10 మధ్య పనిచేశారు), ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాత్ అగ్రావాలాలే అని తేల్చింది.
సీజేఐ ధర్మాసనం అనుకూల తీర్పు...
యూపీ మెడికల్ సీట్ల కుంభకోణానికి సంబంధించి జస్టిస్ ఇష్రత్ సహా ఐదుగురిని గత సెప్టెంబర్లో సీబీఐ అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు వద్దన్నా కూడా ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ కాలేజీలో మాత్రం అడ్మిషన్లు జరిగిపోయాయి. దీనికి కారణం.. ‘అడ్మిషన్లు జరుపుకోవచ్చు' అంటూ సీజేఐ దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పు ఇవ్వడమే. ఈ కేసులో స్వయంగా జడ్జిలపైనే ఆరోపణలు వచ్చినందున.. సీజేఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది.
సీజేఐ వర్సెస్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్...
మెడికల్ సీట్ల కుంభకోణానికి సంబంధించి సదరు స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించాలా? లేదా? అనే అంశంపై వాదనలు విన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం... చివరికి పిటిషన్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించి, దానిని సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే సదరు ధర్మాసనంలో సీజేఐ దీపక్ మిశ్రా ఉండరాదంటూ పిటిషన్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ కోరింది. ఈ కేసులో అన్ని వాదనలు పూర్తయిన తరువాత తుది ఆదేశాలు ఇచ్చేందుకు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ సిద్ధమైన తరుణంలో ‘ఈ వ్యవహారాన్ని మరో బెంచ్కు అప్పగించండి' అంటూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి హఠాత్తుగా ఆదేశాలు వెలువడ్డాయి. అయినాసరే, జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ తుది ఆదేశాలు ఇచ్చేసింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం సీజేఐ లేకుండానే ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్ను ఏర్పాటు చేసింది. కానీ దీనికంటే ఒక్కరోజు ముందు.. జస్టిస్ ఇష్రత్ ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ను తప్పిస్తూ సీజేఐ దీపక్ మిశ్రా ఉత్తర్వులిచ్చారు.
మీడియా సాక్షిగా సీజేఐపై ఆరోపణలు...
పరస్పరం సంబంధం ఉన్న ఈ రెండు కేసుల్లో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలిపై సీనియర్ న్యాయమూర్తులు లోలోపల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా సీజేఐ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో చివరికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు జడ్జిలు మీడియా ముందుకొచ్చి ‘గోడు' వెళ్లబోసుకున్నారు. మరోవైపు ఈ నలుగురు జడ్జిల ఆరోపణలపై ఎదురుదాడి చేసేందుకు సీజేఐ దీపక్ మిశ్రా కూడా సిద్ధమయ్యారు. ఆయన కూడా మీడియా ముందుకే వచ్చి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క ఇలా సుప్రీం న్యాయమూర్తుల వివాదం కొనసాగుతుండగా, మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటికే కొలీజియం ద్వారా నియామకాలు, పారదర్శకత, కేసుల కేటాయింపులు తదితర వ్యవహారాల్లో చోటుచేసుకున్న వివాదాలతో సుప్రీంకోర్టు ప్రతిష్ట మసకబారిందన్న విమర్శల నడుమ తాజా వివాదాం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.