న్యూఇయర్లో స్వీట్న్యూస్ చెప్తా: యడ్డీ, బిజెపిలో డైలమా
బెంగళూరు: కర్నాటక జనతా పార్టీ(కెజెపి) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన సోమవారం షిమోగాలో మాట్లాడుతూ.. తాను ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి వారంలో స్వీట్ న్యూస్ చెబుతానని అన్నారు.
తాను లేకుంటే తాను స్థాపించిన కెజెపి పార్టీకి ఇబ్బందులు ఉంటాయని తెలుసునని, తాను బిజెపిలో చేరడంతోనే సరిపెట్టనని, రాష్ట్రం మొత్తం పర్యటించి బిజెపిని పటిష్టం చేస్తానని, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని యెడ్డీ చెప్పారు.
యడ్డీ పునరాగమనం ప్రశ్నార్థకమా?
యెడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకునే విషయమై బిజెపిలో అభిప్రాయ భేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన పునరాగమనం ప్రశ్నార్థకంగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారకుడు కావటంతో పాటు, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ ఇంకా ముగియక పోవటం వంటి కారణాల వల్ల ఆయన పునరాగమనంపై రాష్ట్ర పార్టీ నేతలు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాక, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ సమయంలో యడ్డీని తిరిగి పార్టీలో చేర్చుకోవటం వల్ల రాజకీయంగా ఆశించిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని పార్టీలోని ఒక వర్గం వాదిస్తోంది. అద్వానీతోపాటు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా యడ్యూరప్ప పునరాగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే కర్నాటక రాజకీయాలను శాసించే లింగాయత్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యడ్డీని దూరం చేసుకోవటంలో అర్థం లేదని మరో వర్గం వాదిస్తోంది.
కాగా, మోడీతోపాటు పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, యడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకుని ఎన్నికల బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నప్పటికీ, అద్వానీ శిబిరం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత దృష్ట్యా వెనుకంజవేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ఉద్యమానికి ఢిల్లీ ఓటర్లు ఇచ్చిన తీర్పు బిజెపి అధినాయకత్వాన్ని పునరాలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలనను ఎండగట్టి, అవినీతికి తావులేని సుపరిపాలన ఇస్తామన్న హామీతో ప్రజల వద్దకు వెళ్లనున్న తమ పార్టీలో ఇప్పుడు యడ్యూరప్పను తిరిగి ఆహ్వానించి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదని పార్టీలో కొంతమంది రాజ్నాథ్కు తెలియచేసినట్లు చెబుతున్నారు. జనవరిలో తిరిగి పార్టీలో చేరటం ఖాయమని యడ్యూరప్ప చేసిన ప్రకటనపై పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆచితూచి స్పందించారు. యడ్యూరప్ప పునఃప్రవేశంపై పార్టీ ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.