చైనా వక్ర బుద్ధి, డోక్లామ్ లో మళ్లీ.., ఏం చేస్తోందో తెలుసా?
డోక్లామ్ లో ఏర్పడిన వివాదం సమసి నెలరోజులైనా కాకముందే మళ్లీ చైనా తన వక్ర బుద్ధిని చాటుకుంది. డోక్లామ్ లో వివాదాస్పద ప్రాంతానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో మరో రోడ్డు విస్తరణ పనులకు పూనుకుంది.
న్యూఢిల్లీ: ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా.. చైనా తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. డోక్లామ్ లో ఏర్పడిన వివాదం సమసి నెలరోజులైనా కాకముందే మళ్లీ తన వక్ర బుద్ధిని చాటుకుంది.
డోక్లామ్ లో వివాదాస్పద ప్రాంతానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో మరో రోడ్డు విస్తరణ పనులకు పూనుకుంది. డోక్లామ్.. భూటాన్ దేశానికి చెందిన ప్రాంతం. కానీ ఆ ప్రాంతం తమ దేశం పరిధిలోకి వస్తుందనేది చైనా అడ్డగోలు వాదన.
ఆమధ్య ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి చైనా ప్రయత్నించగా, భారత సైన్యం అడ్డుపడింది. డోక్లామ్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం జరిపితే భారత్ కు భద్రతా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
ఫలితంగా చైనా ప్రయత్నానికి భారత్ ససేమిరా అంది. దీంతో ఇరు దేశాల నడుమ సుమారు 70 రోజులపాటు ప్రతిష్టంభన నెలకొనగా, చివరికి ఒక ఒప్పందం అనంతరం రెండు దేశాల సైన్యం డోక్లామ్ ప్రాంతం నుంచి నెలరోజుల క్రితమే వైదొలగాయి.
తాజాగా వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో చైనా మరో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. డోక్లామ్ ప్రాంతంలో గతంలో రోడ్డు నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రినే ఇప్పుడు తాజా రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తోంది.
దాదాపు 500 మంది చైనా సైనికులు చైనా రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు. చైనా మరోసారి.. డోక్లామ్ తన భూభాగంలోనిదే అని చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.