సవాల్: దావూద్ కు జైలులో చెక్ పెట్టిన విక్కి శెట్టి
బెంగళూరు: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అతని ప్రత్యర్థి విక్కి శెట్టి సవాలు విసురుతున్నాడు. విక్కి శెట్టి చెప్పింది చేశాడు. నీ వర్గంలోని అనుచరులను అంతం చేస్తానని గతంలో సవాలు విసిరిన విక్కి శెట్టి చివరికి జైలులోనే దావూద్, ఛోటా షకీల్ కు సన్నిహితులైన ఇద్దరిని దారుణంగా హత్య చేయించాడు.
సోమవారం ఉదయం మంగళూరు సెంట్రల్ జైలులో మడూరు యూసఫ్ అలియాస్ ఇషుబు (దావూద్ అనుచరుడు), గణేష్ శెట్టి (ఛోటా షకీల్ శిష్యుడు) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వీరిని హత్య చేసింది ఆకాష్ దావన్ శరణ్ (విక్కి శెట్టి ప్రధాన అనుచరుడు)వర్గీయులు అని పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఐటి, బిటి రంగాలకు ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉంది. మొదటి నుంచి దావూద్ బెంగళూరు నగరం మీద కన్ను వేశాడు. అదే విదంగా మంగళూరు కేంద్రంగా కాసరగూడు (కేరళ)కు చెందిన మడూరు యూసఫ్ సహాయంతో దందా చేస్తున్నాడు.
మొదటి నుంచి బెంగళూరు, మంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దావూద్ ఇబ్రహీంతో విక్కి శెట్టి పోటి పడుతున్నాడు. బలవంతపు వసూళ్లు చెయ్యడం, హత్యలు చెయ్యడంలో దావూద్ కు సవాలు విసురుతూ వస్తున్నాడు. అప్పటి నుంచి ఇరు వర్గాల మద్య కర్ణాటకలో గ్యాంగ్ వార్ జరుగుతున్నది.
వ్యాపారులను బెదిరించి, హత్య చేయించి బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. మాడూరు యూసఫ్ మీద పలు హత్యలతో పాటు 20 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. భారత మాజీ ఉప ప్రధాని ఎల్ కే. అద్వాని గన్ మ్యాన్ శేఖర్ రాథోడ్ ను హత్య చేసిన యూసఫ్ విదేశాలకు పారిపోయాడు.
ఇంటర్ పోల్ సహాయంతో భారత్ అధికారులు 2010 జులై నెలలో సౌదీ అరేబియాలోని రియాద్ లో యూసఫ్ ను అరెస్టు చేసి మంగళూరు తీసుకు వచ్చారు. అదే విదంగా షార్ప్ షూటర్ అయిన గణేష్ శెట్టి మంగళూరు, ముంబైలో ప్రత్యర్థి గ్యాంగ్ లపై హత్యాయత్నం చేశాడు.
2010 మార్చిలో గణేష్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని మంగళూరుకు తరలించారు. విక్కి శెట్టి శిష్యుడు ఆకాష్ దావన్ శరణ్ రిమాండ్ ఖైదీగా గత నెల మంగళూరు సెంట్రల్ జైలుకు మకాం మార్చుకున్నాడు. గత మూడు రోజుల నుంచి యూసఫ్ ను అంతం చెయ్యాలని ఆకాష్ దావన్ శరణ్ ప్లాన్ వేస్తున్నాడు.
సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో అదును చూసి యూసఫ్ మీద మారణాయుదాలతో దాడి చేశారు. ఆ సందర్బంలో యూసఫ్ అనుచరుడు గణేష్ శెట్టి అడ్డు వెళ్లడంతో అతనిని అంతం చేశారు. మంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న విక్కి శెట్టి అనుచరులు సంతోషంతో ఉన్నారు.
అదే జైలులో ఉన్నదావూద్ అనుచరులు పగతో రగిలిపోతున్నారు. మొత్తం మీద విక్కి శెట్టి అనుకున్నది సాదించుకున్నాడు. దావూద్ ఇబ్రహీం అనుచరులు మంగళూరు, బెంగళూరు నగరంలో విక్కి శెట్టి అనుచరుల మీద ప్రతీకారం తీర్చుకుకోవాలని వేచి చూస్తున్నారు.