9/11 దాడులు: దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరిన జో బైడెన్
అమెరికా చరిత్రలోనే అతిపెద్దవైన 9/11 దాడులు జరిగి సరిగ్గా 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అధ్యక్షుడు జో బైడెన్ దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఉండాలని కోరారు.
ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 2,977 మందికి ఆయన నివాళులర్పించారు.
''ఆ ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వారందరినీ మేం గౌరవిస్తాం'' అని బైడెన్ అన్నారు. ట్విన్ టవర్స్పై దాడి సమయంలో అత్యవసర సేవలు అందించిన వారి గురించి మాట్లాడుతూ ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన స్మారక కార్యక్రమాలను శనివారం నిర్వహిస్తున్నారు.
''స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతిసారీ... ఈ ఘోరం జరిగి ఏళ్లు గడిచిపోయినా, ఇప్పటికీ ఆ దాడులు కొన్ని సెకన్ల క్రితమే జరిగినంత బాధగా ఉంటోంది'' అని బైడెన్ వ్యాఖ్యానించారు.
''ముస్లిం అమెరికన్లపై భయం, కోపం, హింస వంటి విపరీత మానవ ప్రవృత్తులు ఉన్నాయి. అయినప్పటికీ దేశ ప్రజల్లోని ఐక్యతే అమెరికాకు గొప్ప శక్తిగా నిలిచిపోయిందని'' ఆయన పేర్కొన్నారు.
''అందరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఒక్కటిగా జీవించాలనే అంశాన్ని మేం నేర్చుకున్నాం.''
''స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై మాకున్న నమ్మకాన్ని వమ్ము చేయడంలో దాడులు విఫలమయ్యాయి'' అని బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. సెప్టెంబర్ 11న ఉదయం జరిగిన దాడుల్లో 67 మంది బ్రిటన్ పౌరులు కూడా మరణించారు.
సెప్టెంబర్ 11 దాడులు ఎలా జరిగాయంటే...
ఈ దాడులకు ఆఫ్గానిస్తాన్ నుంచి ఆల్ఖైదా ప్రణాళిక రచించింది. ప్రయాణికులతో కూడిన 4 అమెరికా విమానాలను ఆత్మాహుతి దాడి సభ్యులు హైజాక్ చేశారు. అందులో రెండు విమానాలు న్యూయార్క్లోని ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చెందిన ట్విన్ టవర్స్లోకి దూసుకెళ్లాయి.
మరో విమానం యూఎస్ రాజధాని వాషింగ్టన్ డీసీకి వెలుపల ఉన్న పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం)ను ఢీకొట్టింది. నాలుగో విమానం పెన్విల్వేనియాలో కూలిపోయింది. ఈ విమానంలోని పౌరులు హైజాకర్లపై ఎదురుదాడి చేసి విఫలమయ్యారు.
శనివారం జరిగే స్మారక కార్యక్రమాలన్నింటినీ అధ్యక్షుడు బైడెన్ ముందుండి నడిపించనున్నారు. ప్రథమ మహిళ జిల్ బైడెన్తో కలిసి దాడి జరిగిన మూడు ప్రాంతాలను సందర్శిస్తారు.
ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల ద్వంసం, పెంటగాన్పై దాడి, ఫ్లయిట్-93 విమానం కూలడం.. ఈ విషాద ఘటనల స్మారకార్థం 6 నిమిషాల పాటు మౌనం పాటిస్తారు.
ఇవి కూడా చదవండి:
- 9/11 Attacks: ఆ రోజు నిమిష నిమిషానికి ఏం జరిగింది?
- '9/11 దాడుల సూత్రధారి ఎఫ్బీఐ నుంచి ముందే ఎలా తప్పించుకున్నాడు’
- 9/11 దాడులను అమెరికా కావాలనే అడ్డుకోలేదా?
- సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?
- 9/11 Attacks: 'బాధ కత్తిలా పదునుగా ఉంటుంది, కాలం దాని తీవ్రతను తగ్గిస్తుంది’
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- 9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)