డ్రైవర్ లేకుండా 92 కిలోమీటర్లు ప్రయాణించిన రైలు, 110 కి.మీ. వేగంతో వెళ్తూ...
సిడ్నీ: డ్రైవర్ లేకుండానే ఓ గూడ్స్ రైలు ఒకటి 92 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆ తర్వాత పట్టాలు తప్పింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని పిబరా ప్రాంతంలో చోటు చేసుకుంది. దాదాపు అది గంటసేపు డ్రైవర్ లేకుండా ప్రయాణించింది. ఈ సంఘటన సోమవారం జరిగింది.
ఈ గూడ్స్ రైలులో ఇనుప ముడి ఖనిజం ఉంది. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేసి ఓ పని మీద కిందకు దిగాడు. ఆ తర్వాత రైలు మెల్లిగా కదిలి ముందుకు సాగింది. ఆ సమయంలో రైలులో ఎవరూ లేరు. ఇలా అది 92 కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత పట్టాలు తప్పింది.
పోర్ట్ హెడ్ల్యాండ్ వెళ్తుండగా పట్టాలు తప్పిన రైలు
పెద్ద మొత్తంలో ఇనుప ఖనిజాన్ని తరలిస్తున్న నాలుగు ఇంజిన్లు, 268 వ్యాగన్లు గల రైలు సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియాలోని న్యూమన్ నుంచి పోర్ట్ హెడ్ల్యాండ్కు బయలుదేరింది. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో పోర్ట్హెడ్ ల్యాండ్కు ఇంకా 210 దూరంలో ఉండగా డ్రైవర్.. రైలును ఆపి కిందకు దిగి ఓ వ్యాగన్ను పరీక్షిస్తున్నాడు. అప్పుడు రైలు దానంతట అదే ముందుకు కదిలింది.
92 కిలోమీటర్లు ప్రయాణించి పట్టాలు తప్పింది
అలా 92 కి.మీ. ప్రయాణించింది. ఆ తర్వాత వ్యాగన్లు పట్టాలు తప్పి పడిపోయాయి. ఉదయం 5.05 సమయంలో అధికారులు రైలును నియంత్రించగలిగారు. కానీ అప్పటికే కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పి పట్టాల పక్కన చిందర వందరగా పడిపోయాయి. ఈ కారణంగా సుమారు 1500మీటర్ల మేర పట్టాలు ధ్వంసమయ్యాయి.
అప్పుడు 110 కిలో మీటర్ల వేగం
268 వ్యాగన్లతో కూడిన ఈ భారీ గూడ్స్ రైలు పొడవు దాదాపు మూడు కిలోమీటర్లు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పోర్ట్ హెడ్ల్యాండ్కు 119 కిలో మీటర్ల దూరంలో పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడానికి ముందు ఆ రైలు వేగం గంటకు 110 కిలో మీటర్ల వేగంతో ఉండినట్లుగా పెర్త్లోని రిమోట్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది.
పెద్ద ఎత్తున నష్టం
ఈ కారణంగా మిలియన్ల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం బీహెచ్పీ అంచనా వేస్తోంది. రైలు లైన్ పునర్నిర్మించేందుకు మూడు నాలుగు రోజులు పడుతుందని తెలిపింది. కాగా, రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.