ఎంహెచ్370: మిస్టరీ వీడేనా, పైలట్ లాస్ట్కాల్పై విచారణ
కౌలాలంపూర్: పదమూడు రోజుల క్రితం గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 దక్షిణ హిందూ మహాసముద్రంలో పడి ఉంటుందని భావిస్తున్నారు. హిందూ మహా సముద్రంలో రెండు భారీ సైజు శకలాలను గుర్తించామని ఆస్ట్రేలియా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రెండు శకలాలు పడిన ప్రాంతానికి నార్వే నౌకలు చేరుకున్నాయి.
ఆస్ట్రేలియాలోని పెర్త్ తీరానికి నైరుతి దిశలో దాదాపుగా 2500 కిలోమీటర్ల దూరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏవో శకలాలు తేలుతూ కనిపించినట్టు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఆ దేశ పార్లమెంటుకు తెలిపారు. విశ్వసనీయమైన ఈ సమాచారాన్ని తాను మలేసియా ప్రధాని నజీబ్ రజాక్కు ఫోన్ చేసి తెలిపినట్టు ఆయన వివరించారు.
ఆచూకీ తెలియకుండా పోయిన విమానం తాలూకూ శకలాలుగా భావిస్తున్న ఈ వస్తువులను ఆస్ట్రేలియన్ మారీటైమ్ సేఫ్టీ అథారిటీ (ఏఎంఎస్ఏ) అధికారులు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్టు అబ్బాట్ వివరించారు. ఆ శకలాలు ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ఆస్ట్రేలియా వైమానిక దళం ఓరియన్ అనే విమానాన్ని పంపినట్టు ఆయన చెప్పారు. దీంతోపాటు మరో మూడు విమానాలను కూడా అన్వేషణకు పంపనున్నారు. ఇంకా, న్యూజిలాండ్, అమెరికాల నుంచి కూడా మిలటరీ జెట్ విమానాలు, ఓడలు అక్కడికి అన్వేషణ నిమిత్తం చేరుకోనున్నాయి.
భారత్ కూడా ఈ అన్వేషణకు రెండు విమానాలను కేటాయించింది. అయితే, ఈ శకలాలను కనుగొనడం అంత సులభం కాదని ఇది అత్యంత క్లిష్టమైన పని అని పార్లమెంటుకు వివరించిన టోనీ అబ్బాట్.. అవి విమాన శకలాలు కాకపోయే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఇక మార్చి 16నాటి శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన ఈ రెండు వస్తువుల్లో ఒకటి దాదాపు 78 అడుగులు, మరొకటి 15 అడుగులు ఉన్నట్టుగా ఏఎంఎస్ఏ అధికారి జాన్ యంగ్ తెలిపారు.
ఆ తర్వాత నాలుగు రోజులు గడిచిపోయిన నేపథ్యంలో ఆ వస్తువులు అక్కడి నుంచి కొట్టుకుపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ శకలాలను కనుగొనడానికి దాదాపు 6 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో శోధించాల్సి ఉందని వాటిని కనుగొని, అవి ఏమిటో ద్రువీకరించడానికి కనీసం రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయమే పట్టవచ్చని ఏఎంఎస్ఏ అంచనా వేస్తోంది.
కాగా, శకలాలు కనిపించినట్టుగా భావిస్తున్న ప్రాంతానికి సమీపంలో ప్రయాణిస్తున్న నార్వే ఓడ (కార్లను తరలించే కార్ కారియర్) సెయింట్ పీటర్స్బర్గ్ అక్కడికి చేరుకున్నట్టు దాని యజమాని తెలిపారు. కార్లను తీసుకెళ్లే ఈ ఓడ నిజానికి మడగాస్కర్ నుంచి మెల్బోర్న్కు ప్రయాణిస్తోంది. ఆస్ట్రేలియా అధికారుల విజ్ఞప్తి మేరకు దారి మార్చుకుని అక్కడికి చేరుకుంది. మరోవైపు విమానంలో ఉన్న 154 మంది చైనీయుల గురించి ఆందోళన చెందుతున్న చైనా, ఆస్ట్రేలియాకు సమీపంలో జరుగుతున్న ఈ అన్వేషణ నిమిత్తం మంచుగడ్డలను పగలకొట్టగలిగే ఐస్ బ్రేకర్ షిప్ను పంపే ప్రయత్నాల్లో ఉంది.
మరోవైపు గల్లంతైన విమానం విషయమై మలేషియా అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తోంది. విమానం పైలట్ కుటుంబ సభ్యులు విచారణకు సహకరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కాగా, గల్లంతైన విమానం పైలట్ చివరి ఫోన్ కాల్కు సంబంధించి విచారణ జరుగుతోంది. విమానం కౌలాలంపూర్ నుండి టేకాఫ్ అయిన నిమిషానికి పైలట్ ఓ ఫోన్ కాల్ మాట్లాడినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్ పైన విచారణ చేస్తే ఏదైనా కొత్త విషయం తెలుస్తుందని భావిస్తున్నారు. అయితే, విచారణకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు.