నీస్ నరమేథం మా చర్యే : ఐసిస్
లెబనాన్ : ఫ్రాన్స్ లో నరమేథం సృష్టించింది తామే అని ప్రకటించింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్. నీస్ లో ట్రక్కు దాడి ద్వారా భీభత్సం సృష్లించి, భారీ సంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్న ఘటనకు తామే సూత్రధారులమని ఓ ప్రకటన జారీ చేసింది.
ఉగ్రవాద సంస్థకు చెందిన అమఖ్ అనే వార్తా సంస్థ ద్వారా శనివారం నాడు ఈ విషయం వెల్లడయింది. ఐసిస్ ఉగ్రవాద చర్యలను అణిచివేసే దిశగా సంకీర్ణ ప్రభుత్వాలన్ని పిలుపునిచ్చిన నేపథ్యంలోనే నీస్ పై దాడికి తెగబడినట్టు అమఖ్ పేర్కొంది. ట్రక్కును నడిపిన డ్రైవర్ ఐసిస్ కు చెందిన వ్యక్తేనని సదరు వార్తా సంస్థ తెలిపింది.
ఇకపోతే బాస్టిల్ డే వేడుకల సందర్బంగా.. చోటు చేసుకున్న ట్రక్కు దాడిలో 84 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కావడంతో అక్కడి ప్రజలంతా బాణసంచా వేడుకలను తిలకించడానికి భారీ సంఖ్యలో నీస్ వీధుల్లోకి రావడంతో.. ట్రక్కుతో విరుచుకుపడ్డ ఉగ్రవాది దాదాపు 2కి.మీ వీధుల్లో గుండా వీక్షకులందరినీ తొక్కుతూ నరమేధం సృష్టించాడు. అనంతరం దుండగుడిపై కాల్పులు జరిపి అతన్ని మట్టుబెట్టిన ఫ్రాన్స్ పోలీసులు, నేరస్తుడిని ట్యునీషియా దేశస్తుడిగా గుర్తించారు.