శిరీష కేసులో అర్థరాత్రి హైడ్రామా?: పోలీసులు ఎందుకలా చేశారు.. మభ్యపెట్టడానికేనా?
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్, హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్లకుండా.. కేవలం శిరీష ఆత్మహత్య చేసుకున్న రోజున ఎక్కడెక్కడ తిరిగారో అక్కడే మరోసారి వాహనాల్లో తిప్పి తిరిగి హైదరబాద్ వచ్చినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో యూటర్న్ తీసుకున్నట్లు కనిపించిన పోలీసులు.. చివరకు ఆమెది ఆత్మహత్యేనని మరోసారి స్పష్టం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నో అనుమానాలు నివృత్తి కాకుండా పోలీసులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూనే ఉన్నారు.
రాజీవ్, శ్రవణ్ ల కస్టడీ ముగిసినా... ఎన్నో విషయాలకు ఇంకా సమాధానం దొరకలేదనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మొత్తం వ్యవహారంలో తేజస్విని పాత్ర గురించి నిగ్గు తేల్చకపోవడం.. శిరీషను వ్యభిచారిణిగా చిత్రీకరించి వదిలించుకోవాలనుకున్నారా?.. ఆత్మహత్య చేసుకుంటే ఆమె నాలుక బయటకెందుకు రాలేదు? శిరీష మృతి తర్వాత ఆడియో టేపులు ఎలా లీకయ్యాయి? అందులో శిరీషతో మాట్లాడిన నందు, నవీన్ ఎవరు? వంటి ప్రశ్నలన్ని సందిగ్దంగానే మిగిలిపోయాయి.
శిరీష కేసులో పోలీసుల యూటర్న్!?: రాజీవ్ పదేపదే అదే చెబుతున్నాడు, హత్యేనంటున్న మేనమామ!
ఇదిలా ఉంటే, బుధవారం నాడు రాజీవ్, శ్రవణ్ లను కోర్టు ఎదుట హాజరుపరచాల్సి ఉండటంతో.. అర్థరాత్రి పూట వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించడం గమనార్హం. అర్థరాత్రి సమయంలో గోప్యంగా ఉస్మానియా ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించారు. ఆపై 12.15గం.కు మీడియా కంటపడకుండా రహస్యంగా కుకునూర్ పల్లి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్, హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్లకుండా.. కేవలం శిరీష ఆత్మహత్య చేసుకున్న రోజున ఎక్కడెక్కడ తిరిగారో అక్కడే మరోసారి వాహనాల్లో తిప్పి తిరిగి హైదరబాద్ వచ్చినట్లు చెబుతున్నారు.దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదంతా ఓ హైడ్రామా అని కేవలం మీడియాను మభ్యపెట్టేందుకే పోలీసులు కుకునూర్ పల్లి వెళ్లినట్లు కవర్ చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసులు మాత్రం.. అనుమానాలుంటే హైదరాబాద్ రండి అంటూ శిరీష కుటుంబ సభ్యులకు సూచించడం తెలిసిందే.