మరువలేం: జయశంకర్కు సిఎం కెసిఆర్, మంత్రుల నివాళి
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ నాల్గొవ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణభవన్లో జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నామన్నారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతోన్న అభివృద్ధి తప్పక సారు ఆత్మకు శాంతిని చేకూర్చుతుందని పేర్కొన్నారు. జయశంకర్సార్ నుంచి స్ఫూర్తి పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకు ముందు సీఎం కెసిఆర్ తెలంగాణభవన్ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్త జిల్లాకు జయశంకర్ సార్ పేరు
తెలంగాణ ఆశయ సాధనకోసం పరితపించిన వ్యక్తి ప్రొ. జయశంకర్ సార్ అని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఆదివారం జయశంకర్ నాల్గొవ వర్థంతిని పురస్కరించుకుని తెలంగాణభవన్లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ కల సాకారం అయినప్పటి నుంచి ప్రతీ సందర్భంగా వారిని స్మరించుకున్నామని చెప్పారు. సార్ యాదిలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టామని చెప్పారు. వరంగల్ జిల్లాలో ఏర్పడే కొత్త జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెడ్తామని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కృతనిశ్చయంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినవేనని అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలన్నింటిని సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారని తెలిపారు. ఉద్యమాలే కాదు ప్రభుత్వాన్ని కూడా నడపగలనని కేసీఆర్ నిరూపించుకున్నారని కొనియాడారు.
ఎంపి వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని మేధావుల్లో రేకెత్తించిన గొప్ప దార్శనికుడు సారు అని కొనియాడారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చెబుతూ మళ్లీ వచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఈయన ద్వారా తెలంగాణ వస్తుందని కేసీఆర్ను ఉద్దేశించి సారు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉద్యమంలో సీఎం కేసీఆర్కు అన్ని విధాలా సహకరించిన వ్యక్తి ప్రొ. జయశంకర్ సార్ అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. జయశంకర్ సార్ను ఎవరం మరువలేమని అన్నారు. ప్రాధాన్యత గల ప్రాంతంలో సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.