దాడి కేసు: టిడిపి మాజీ ఎంపి రమేష్ రాథోడ్ అరెస్ట్
ఆదిలాబాద్/హైదరాబాద్: ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్మెన్తో గొడవపడిన కేసులో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పార్లమెంటుసభ్యుడు రమేష్ రాథోడ్ను ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నిర్మల్ కోర్టులో హాజరుపర్చారు.
గత మూడు రోజుల క్రితం జిల్లాలోని కడెంరోడ్డులో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను ఎమ్మెల్యే రేఖా నాయక్ పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఆమె గన్మెన్పై దాడికి పాల్పడ్డాడు.
దీనిపై రేఖానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రమేష్ రాథోడ్ను అరెస్ట్ చేసిన పోలీసులు, నిర్మల్ కోర్టులో హాజరుపర్చారు. కాగా, రమేష్ రాథోడ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మహిళలను వేధిస్తున్న 16 మందిపై కేసులు: డిసిపి
హైదరాబాద్: రోడ్లపై మహిళలను వేధిస్తున్న 16 మంది ఆకతాయిలపై కేసులు నమోదు చేసినట్లు మల్కాజ్గిరి డిసిపి రమా రాజేశ్వరి తెలిపారు. మల్కాజ్గిరి ఏరియాలో ఇప్పటి వరకు 45 మంది యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
నిర్భయచట్టం కింద నలుగురు యువకులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కింద 36 మంది వీధుల్లో తిరుగుతున్న పిల్లలను సంరక్షించామన్నారు.