తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు! త్వరలో 20 వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ నిరుద్యోగులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలోనే 20వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్లపై విపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఎమైందని బీజేపీ నేతలను నిలదీశారు.
మన ఊరు - మన బడితో బీజేపీలో ఉలిక్కిపాటు
రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో దళితబంధు అమలుపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేసేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. దీనిని అభినందించాల్సింది పోయి విపక్షాలు నానాయాగి చేస్తున్నాయని అని మండిపడ్డారు. "మన ఊరు - మన బడి" పథకంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తోందోనని కమలం నేతలు ఉలిక్కిపడుతున్నారని విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉపాధ్యాయులు ఉన్నారని స్పష్టం చేశారు.
నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర బీజేపీదే..
దేశంలో నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర బీజేపీకే చెల్లుతుందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి .. యువతను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం ముందుందన్నారు. త్వరలోనే 20వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విమర్శించే అర్హత బీజేపీకి లేదని మండిపడ్డారు.
బండి సంజయ్కు సవాల్
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన జరుగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 53 రెసిడెన్షియల్ ఎస్సీ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే రాష్ట్రానికి రావాల్సిన 21 నవోదయ పాఠశాలను తీసుకురావాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. అలాగే కేంద్ర ప్రబుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయించాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి ఎస్సీ, ఎస్టీలకు తీరని ఆన్యాయం చేస్తుందని హరీశ్ రావు మండిపడ్డారు.
మార్చి 31లోపు దళిత బంధు అమలు
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని మార్చి 31వ తేది లోపు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.తొలుత ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఎంపిక పూర్తి చేయాలని ఆధికారులకు హరీశ్ రావు ఆదేశించారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత దళితబంధు ఉండదన్న విపక్షాలు .. ఇప్పుడు సమాధానం చెప్పాలని మంత్రి నిలదీశారు.