కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులతో, సొంత పార్టీనేతలతో కలిసి కేసీఆర్ డ్రామా: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సుదీర్ఘ మీడియా సమావేశంలో అసలు మేటర్ ఏమీ లేదని, కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ని టార్గెట్ చేయడం కోసమే మీడియా సమావేశాన్ని పెట్టారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదనతో కెసిఆర్ వున్నారని, ఆ తీవ్ర అసహనంతో మీడియా ముందుకు వచ్చిన ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారు అని కిషన్ రెడ్డి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు.
బీజేపీ అగ్రనేతలకు వీడియోలో చర్చలు జరిపిన వారితో ఏం సంబంధం ?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ కీలక నేతలు అయిన అమిత్ షా కు, జేపీ నడ్డా కు, బి ఎల్ సంతోష్ కు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతల పై కెసిఆర్ చేసిన అర్ధరహితమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొని ఆయన, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చర్చలు జరిపిన వారికి బిజెపికి సంబంధం లేదని వెల్లడించారు. వీడియో లో చర్చలు జరిపిన వారితో బీజేపీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.
కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులతో, సొంత పార్టీనేతలతో కలిసి కేసీఆర్ అందమైన అబద్దం
అసలు ఈ వీడియోలో ఉన్నవారితో బీజేపీకి సంబంధం లేదని నేను, మా పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టం చేశామని వెల్లడించారు. అయినా కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులతో, సొంత పార్టీనేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి ఇదే నిజం అని చెప్పేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేసి దానిని వీడియో తీసుకోవటం రోజురోజుకూ ఆయనలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతా భావానికి నిదర్శనం అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి.. దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదం అన్నారు కిషన్ రెడ్డి. ఈ మధ్యకాలంలో కేసీఆర్ నోరు తెరిస్తే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి, ముందు రాష్ట్రాన్ని బాగు చేసి ఆ తర్వాత దేశం గురించి ఆలోచించాలని చురకలంటించారు. కెసిఆర్ చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, కచ్చితంగా ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.