'చిరు' షాక్: నాడు ముఖం చాటేశారు, పవన్ను వెంటాడుతున్న ప్రజారాజ్యం
Recommended Video

హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనను అడ్డుకుంటామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు దీపక్ కుమార్ సోమవారం హెచ్చరించారు. పవన్ తెలంగాణ పర్యటన విషయంలో విపక్షాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్, బీజేపీలు ఆయన పర్యటనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో లాలూచీతోనే పవన్ తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ను అవి వెంటాడుతున్నాయి
మరోవైపు, గతంలో తెలంగాణలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనను వెంటాడుతున్నాయి. మొన్న పొన్నం ప్రభాకర్, నిన్న బీజేపీ కృష్ణసాగర్, ఆ తర్వాత మాలమహానాడు పవన్ కళ్యాణ్కు హెచ్చరికలు జారీ చేసింది. ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తిరగదోడుతున్నారు.

ఆ తర్వాత ముఖం చాటేశారు
తాజాగా, మాల మహానాడు మరో విషయంతో ముందుకు వచ్చింది. ఆనాడు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ విస్మరించారని ఇప్పుడు తిరగదోడుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పవన్ ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో ప్రచారం నిర్వహించి దళిత, గిరిజనుల విషయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ముఖం చాటేశారన్నారు.

మరోసారి ప్రజలను మోసం చేసేందుకు
ఈ మేరకు సోమవారం హైదరాబాద్ అంబర్పేట జైస్వాల్ గార్డెన్లోని మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల దీపక్ కుమార్ మాట్లాడారు. సమస్యల అధ్యయనం కోసమని తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ యాత్రకు పూనుకున్నారని ఆరోపించారు.

రాజకీయ పబ్బం గడుపుకునేందుకు
తెలంగాణ ప్రజలను మోసగించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న పవన్ పర్యటనను అన్నిచోట్ల అడ్డుకోవాలని మాల మహానాడు కార్యకర్తలకు దీపక్ కుమార్ పిలుపునిచ్చారు. కాగా, ప్రజారాజ్యం పార్టీ నుంచి పాఠాలు నేర్చుకున్నానని పవన్ పదేపదే చెబుతుంటారు. ఇప్పుడు అదే పార్టీ తరఫున ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఆయనను వెంటాడుతున్నాయి.












Click it and Unblock the Notifications