రేవంత్ రెడ్డి ఆందోళన, కోదండరాం ప్రశ్న: కేసీఆర్ దిగొస్తున్నారా?
హైదరాబాద్: మల్లన్న సాగర్ వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందా? భూసేకరణలో మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. జీవో 123ని మార్చవచ్చునని, నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారమే ఇచ్చే విషయమై పరిశీలిస్తోందంటున్నారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని, నిర్వాసితులకు ఎక్కువ చెల్లించాలని, అలాగే జీవో 123 ప్రకారం కాకుండా 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని విపక్షాలు, జేఏసీ చైర్మన్ కోదండరాం వంటి వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
గత రెండేళ్లుగా తెలంగాణలో తెరాసకు తిరుగు లేకుండా పోయింది. అయితే, మల్లన్న సాగర్ విషయంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందనే వాదనలు వినిపించాయి. విపక్షాల ఆందోళనలు, కోదండరాం నిలదీత నేపథ్యంలో... వారి మాటే చెల్లుబాటు అయ్యేలా కనిపిస్తోందని అంటున్నారు.
ఇప్పటికే జీవో 123 ప్రకారం కాకుండా 2013 చట్టం ప్రకారం చెల్లిస్తామని చెప్పారు. అంతకుముందు రోజే రేవంత్ రెడ్డి ఆందోళన చేశారు. మల్లన్న సాగర్ విషయంలో విపక్షాలు, కోదండరాంలు ఒక్కటి అయ్యాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తలొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించిన ఉత్తర్వులో మార్పులు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, 2013 భూసేకరణ చట్టంలో ఉన్న అంశాలను చేర్చుతూ గతేడాది జారీ చేసిన జీఓ-123కు మార్పులు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి.
ఏమిటీ జీవో 123?
భూసేకరణ చట్టం ద్వారా భూమి తీసుకొని పనులు ప్రారంభించాలంటే ఆలస్యమవుతుందని భావించిన ప్రభుత్వం భూమి కొనుగోలుకు ప్రత్యేకంగా జీవో 123ను తెచ్చింది. దీని ప్రకారం రైతులే తాము భూమి అమ్మేందుకు ముందుకు వస్తే, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించి ఆమోదిస్తుంది.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డీవో పేరుతో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారు. స్థానికంగా ఉన్న ధరలు, భూమి స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని ధరలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులో పునరావాసం అన్న పదాన్ని తొలగించారు. దీనిని ఇప్పుడు మార్చనున్నారని తెలుస్తోంది.