ఏం జరిగి ఉంటుంది?: 'మిస్టరీ డెత్', తల ఒకచోట.. మొండెం మరోచోట
నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం సృష్టించింది. హత్యానంతరం తలను ఒకచోట, మొండేన్ని మరోచోట పడేశారు. మృతుని ఆచూకీ వెతుక్కుంటూ అతని కుటుంబ సభ్యులు నిర్మల్ రావడంతో అతను ఉత్తరప్రదేశ్ వాసిగా గుర్తించారు. అయితే హత్య చేసిందెవరు?.. ఎందుకు చేశారు? అన్న దానిపై ఇంకా చిక్కుముడి వీడలేదు.
ఎవరీ వ్యక్తి?..:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరన్పూర్ జిల్లా నపుర్ తాలూకా బాయిగడీ గ్రామానికి చెందిన మొహ్మద్ ఇస్రార్(28), అతని సోదరుడు ఫైజాన్, బాబాయ్ ఎండీవాజిద్లు బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంకు వచ్చారు. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ డ్రెస్ మెటీరియల్ వ్యాపారం చేసే వీరు.. ఆ క్రమంలోనే ఏపీకి వచ్చారు.
అనంతపురం నుంచి నిర్మల్..:
అనంతపురం పట్టణంలో కొంతకాలంగా వీరు వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ లో డ్రెస్ మెటీరియల్ వ్యాపారం చేసే ఫెరోజ్ అనే వ్యక్తితో వీరికి పరిచయం ఏర్పడింది.
ఫెరోజ్ వీరి వద్ద నుంచి కొంత మెటీరియల్ తీసుకెళ్లడంతో.. కొంత డబ్బు బాకీ పడ్డాడు. ఆ డబ్బులు వసూలు చేసేందుకు ఫిబ్రవరి 22న ఇస్రార్ తన సోదరుడు ఫైజాన్తో పాటు మరో సన్నిహితుడు అక్రంలతో కలిసి నిర్మల్ వచ్చారు.
అక్కడే వ్యాపారం:
నిర్మల్ వచ్చిన ఇస్రార్.. ఇక్కడే వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు. ఆ మేరకు నిర్మల్ పట్టణం బస్టాండ్ ప్రాంతం పింజారిగుట్ట సమీపంలోని అప్సర్ కాంప్లెక్స్ లో ఓ షాపును అద్దెకు తీసుకున్నాడు.
అందులోనే సోదరుడు ఫైజాన్, అక్రంలతో నివాసముంటూ అందులోనే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల ఓ శుభకార్యం నిమిత్తం ఫైజాన్ ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని స్వగ్రామానికి వెళ్లాడు.
ఇస్రార్ ఆచూకీ కోసం నిర్మల్ వెళ్లారు..:
ఫైజాన్ ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయిన తర్వాత.. ఇస్రార్తో మాట్లాడేందుకు ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
మూడు రోజుల పాటు వరుసగా ప్రయత్నిస్తున్నా.. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మరో సోదరుడు ఎండీ ఖాలిద్ కు అనుమానం వచ్చింది. దీంతో అనంతపురంలో ఉండే బాబాయ్ వాజిద్కు ఫోన్ చేసి నిర్మల్ వెళ్దామన్నాడు. అనుకున్న ప్రకారం ఇద్దరు హైదరాబాద్లో కలుసుకుని, అక్కడినుంచి నిర్మల్ వెళ్లారు.
దారుణ హత్య:
నిర్మల్ వెళ్లిన ఖాలిద్, వాజిద్ అక్కడ ఇస్రార్ గదికి తాళం వేసి ఉండటం గమనించారు. స్థానిక పోలీసులను సంప్రదించగా.. భైంసాలో ఓ యువకుడి తల లభించిందని తెలిసింది. వెళ్లి చూశాక అది ఇస్రార్దే అని నిర్దారించుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఆపై పోలీసుల సహాయంతో ఇస్రార్ గది తలుపులను బద్దలుకొట్టి చూడగా.. లోపలంతా దుర్వాసన రావడం గమనించారు. బాత్రూమ్ లో ఇస్రార్ మొండేన్ని కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు.
ఏం జరిగి ఉంటుంది:
ఇస్రార్ తో పాటు ఉన్న అక్రం ఆచూకీ లేకపోవడం.. అతని ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో పోలీసులకు అతనిపై అనుమానం కలుగుతోంది. అక్రంతో పాటు ఆదిలాబాద్లో ఉండే ఫెరోజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వ్యాపార విభేదాలతో ఫెరోజ్ ఈ హత్య చేయించి ఉంటాడా?.. లేక అక్రమే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా?.. ఇవేవి కాకపోతే మరేం ఇంకెవరు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారన్నది తేలాల్సి ఉంది.