మునుగోడు ఎఫెక్ట్.. పదవుల పందేరం మొదలెట్టిన సీఎం కేసీఆర్; నల్గొండజిల్లా ఎస్టీనేతకు నామినేటెడ్ పోస్ట్!!
మునుగోడు ఉప ఎన్నికకు టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోందా? అందులో భాగంగా నియోజకవర్గంలోని సామాజికవర్గాల వారీగా ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కోసం ప్రయత్నాలు చేస్తోందా ? సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతుందా ? తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన గిరిజన నేతకు ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం వెనుక మతలబు అదేనా? అంటే అవును అన్న చర్చ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయవర్గాలలో జరుగుతోంది.
Recommended Video


నల్గొండ జిల్లాలో బలమైన నేతలకు నామినేటెడ్ పదవుల పందేరం
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ సామాజిక సమీకరణాలను అంచనా వేసుకుంటూ రాజకీయాలను సాగిస్తుంది. పార్టీ నుండి అభ్యర్థిగా అవకాశం ఇచ్చే వారి విషయంలోనూ టిఆర్ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో హుజురాబాద్ లో జరిగిన పొరపాటును ఇక్కడ రిపీట్ కాకుండా చూసుకునే పనిలో ఉంది. గతంలో దుబ్బాక, హుజురాబాద్ లలో పార్టీ అభ్యర్థుల ఎంపికలోనే తప్పు జరిగినట్లు గా భావిస్తున్న టిఆర్ఎస్ పార్టీ, ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటుంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలతో బలమైన నేతలకు పదవులను కట్టబెట్టి పార్టీ కోసం పని చేసేలా వ్యూహాలు రచిస్తోంది.

షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నల్గొండ జిల్లా గిరిజననేత
గిరిజన సంక్షేమ శాఖలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSSTCFDC) చైర్మన్గా ఇస్లావత్ రాంచందర్ నాయక్ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. రెండేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇస్లావత్ రామచంద్ర నాయక్ నల్గొండ జిల్లాకు చెందిన నేత కావడంతో ఆయన నియామకం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇస్లావత్ రామచంద్ర నాయక్ కు ఎస్టి కమ్యూనిటీ లో మంచి పట్టు ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు అవకాశం ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు

రాజకీయంగా ప్రాధాన్యంగా మారిన నియామకం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను స్పీకర్కు సమర్పించిన నేపథ్యంలో ఈ నియామకం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్ట్ ఈ నియామకం అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఎస్టీ ఓటు బ్యాంకు కోసమే గులాబీ పార్టీ ఎత్తుగడ
మునుగోడు నియోజక వర్గంలో ఎస్టీ ఓటర్లు అధికంగా ఉన్నారని, వారిని అధికార పార్టీ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఎత్తుగడ వేసినట్టుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలోని వివిధ నామినేటెడ్ పదవులకు మరికొంత మంది నేతలను నామినేట్ చేయడంతో పాటు మునుగోడుపై సీఎం కేసీఆర్ నిధుల వర్షం కురిపించాలని భావిస్తున్నారు. అభివృద్ధి పనులతో నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు.












Click it and Unblock the Notifications