భత్కల్ ఫోన్ ఉదంతం ఉత్తదే, రేవంత్ రాజకీయ నేత: వికె సింగ్
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఉగ్రవాది యాసిన్ భత్కల్ టెలిఫోన్ ఉదంతం ఉత్తదేనని రాష్ట్ర జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. జైలు నుంచి భత్కల్ 27 సార్లు తన కుటుంబసభ్యులతో మాట్లాడాడని, అతడు మాట్లాడిన అన్ని కాల్స్ రికార్డు చేశామని చెప్పారు. నిఘా వర్గాల నుంచి కూడా ఎలాంటి సమాచారం, హెచ్చరికలు కూడా రాలేదని, ఎవరో కావాలని తప్పుడు సమాచారం సృష్టించారని ఆయన చెప్పారు.
రాష్ట్ర జైళ్లశాఖ మొదటి డీజీగా బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన సందర్భంగా డీజీ వీకే సింగ్ శుక్రవారం చర్లపల్లి జైలులోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యాసిన్ భత్కల్ను ప్రతీసారి కోర్టుకు తీసుకుని వెళ్లడమంటే కాస్తా ఇబ్బందికరమేనని ఆయన అన్నారు. జైలు నుంచి కోర్టుకు తీసుకుని వెళ్లే మార్గంలో భత్కల్ తప్పించుకోవడానికి అవకాశాలు లేకపోలేదని ఆయన అన్నారు.
భత్కల్తో పాటు ఇతర ఉగ్రవాదులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ఉంచుతామని సూచించామని, అయితే ట్రయల్స్ ఉన్నందున కచ్చితంగా తీసుకుని రావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించిందని ఆయన చెప్పారు. తమకు కాస్తా ఇబ్బందికరమైనా కోర్టు ఆదేశాల మేరకు తీసుకుని వెళ్తున్నామని, ఈ విషయంలో న్యాయస్థానాలదే తుది నిర్ణయమని ఆయన అన్నారు.
తనకు ప్రాణహాని ఉందంటూ భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖ విషయాన్ని ప్రస్తావించగా, ప్రాణహాని ఉందని భత్కల్ చెప్తే తాము ఏం చేసేదని, తమ జైల్లో ఉన్నంత వరకు అతను భద్రంగానే ఉంటాడని, ఎలాంటి అపోహలకు తావు లేదని వికె సింగ్ చెప్పారు. భత్కల్ జైలు నుంచి పారిపోతారడని తమకు కేంద్రం నుంచి ఎటువంటి హచ్చరికలు కూడా రాలేదని ఆయన అన్నారు. జైలులో కల్పించిన ఫోన్ ద్వారా భత్కల్ తన భార్యతో మాట్లాడిన రికార్డులన్నీ పరిశీలించామని, ఎక్కడ కూడా పారిపోతానని చెప్పిన సందర్భం లేదని అన్నారు.
చర్లపల్లి జైలులో అవకతవకలు జరుగుతున్నాయని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను వికె సింగ్ కొట్టి పారేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడని, రేవంత్ రెడ్డి ఏం చెప్పారో తమకు తెలియదని, జైలులో మాత్రం ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆయన అన్నారు.
త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జైళ్లశాఖ తరఫున పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా జైళ్లశాఖకు సంబంధించిన భూమిలో లక్ష టేకు చెట్లు పెంచనున్నట్టు తెలిపారు. ఖైదీలకు బీమా, వారి పిల్లలకు విద్య వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.