ఎస్ఎస్బీ పరీక్షలో గురుకుల విద్యార్ది సత్తా - ఆకాశమే హద్దుగా : ఫైటర్ పైలెట్ కోర్సుకు ఎంపిక..!!
లక్ష్యం ఆ విద్యార్దిని ముందుకు నడిపించింది. కష్టాలేవీ తన పట్టుదలకు అడ్డు కాలేదు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన విద్యార్ధి ఇప్పుడు అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎస్ఎస్బీ పరీక్షల్లో సత్తా ఎయిర్ఫోర్స్ ఫైటర్ పైలెట్ కోర్సుకు ఎంపికైన గురుకుల విద్యార్ధి అశోక్ సాయి సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ అవుతోంది. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన అశోక్ సాయి స్ఫూర్తిదాయక ప్రయాణమిది.
కుటుంబ సమస్యలు..ఆర్దిక కష్టాలు
అశోక్ సాయికి అయిదేళ్ల వయసులో తండ్రికి పక్షవాతం వచ్చింది. టైలరింగ్ పనిచేసే తల్లి సంపాదించే అరకొర డబ్బే వారి కుటుంబానికి జీవనాధారంగా మారింది. అక్క బీటెక్ చదువుతోంది. మరో అక్కకు వివాహం అయింది. కరీంనగర్ రుక్మాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ విద్యార్ధికి చిన్నతనం నుంచే డిఫెన్స్ విభాగంలో చేరాలనే కోరిక ఉండేది.
సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్లో చేరిన తర్వాత తన లక్ష్యానికి ఒక మార్గం దొరికింది. ఇంటర్ చదువుతున్నప్పుడు దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ చూసేందుకు వెళ్లిన సమయంలో రక్షణదళంలో చేరాలనే ఆలోచన మరింత బలపడిందని అశోక్ సాయి చెప్పుకొచ్చారు.
గురుకులం నేర్చుకున్నదే తనకు..
తాను పాఠాల్లో భాగంగా నేర్చుకున్నదీ..అదే సమయంలో స్నేహితులతో ఇంగ్లీషులోనే చర్చలు చేయటం తనకు ఇంటర్వ్యూలో కలిసి వచ్చాయని చెప్పారు. న్యూఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే యూపీఎస్సీ, సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో ఎయిర్ఫోర్స్ ఫైటర్ పైలెట్ కోర్సుకు ఎంపికయ్యారు.
పుణెలోని ఖడక్వాసలాలోని ఎన్డీఏలో భారత వాయుసేన పైలెట్గా శిక్షణ తీసుకోనున్నారు. గురుకుల పాఠశాల విద్యార్థి అశోక్ సాయి సాధించిన ఈ విజయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు.
చిన్నప్పటి నుంచి కోరికనే..
నిరుపేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి భారత వైమానిక దళానికి ఎంపిక కావడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. పేద విద్యార్థుల భవిష్యత్తు గొప్పగా ఉండాలని సీఎం కేసీఆర్ చూపించిన చొరవ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల ప్రయాణంలో అశోక్ సాయి సాధించిన విజయం ఓ మైలురాయి అని సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రొస్ అన్నారు. లక్షల సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని, వారిలో ఎంపిక రేటు చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ నెల 15వ తేదీన శిక్షణలో చేరాల్సి ఉందని అశోక్ సాయి తెలిపారు.
ఎయిర్ఫోర్స్ ఫైటర్ పైలెట్ శిక్షణకు
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పాటుగా ఉపాధ్యాయుల మార్గదర్శనంతోనే తాను సక్సెస్ అయ్యానని అశోక్ సాయి చెప్పుకొచ్చారు. కష్టాలు.. సమస్యలు వెంటాడుతున్నా... తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. విమానం ఎక్కుతానని కలలో కూడా అనుకోలేదంటూ ఉద్వేగానికి లోనయిన అశోక్ సాయి.. ఇప్పుడు శిక్షణకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. సత్తా ఉంటే .. లక్ష్యం చేరుకోవాలనే పట్టుదల ఉంటే ఎటువంటి కష్టాలు అడ్డుకావనే విషయాన్ని నిరూపించి... అశోక్ సాయి అనేక మందికి స్పూర్తిగా నిలిచారు.