ఇంకా ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే స్పందిస్తారు కేసీఆర్ : హన్మకొండ దీక్షలో వైఎస్ షర్మిల ప్రశ్న
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానని రాజకీయ ఆరంగేట్రం చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల మొదటి నుండి నిరుద్యోగ సమస్యపై పోరాటం సాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తానని సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న షర్మిల తాజాగా మరోమారు కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో నిత్యం నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ కు పట్టింపు లేదని ఆమె వ్యాఖ్యానించారు.
వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ .. రేపు నిరుద్యోగ దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ విజ్ఞప్తి
హన్మకొండలో నిరుద్యోగ నిరాహార్ దీక్ష చేసిన షర్మిల
నిరుద్యోగ నిరాహార దీక్షలు కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఈరోజు 10వ వారం నిరుద్యోగ నిరాహార దీక్ష లో భాగంగా హన్మకొండలో నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు . ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను కొనసాగిస్తున్న వైయస్ షర్మిల ఈరోజు పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల ప్రయోగ శాల ఓరుగల్లులో నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్ చేరుకున్న వైయస్ షర్మిల హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా దీక్షా స్థలికి చేరుకున్నారు.
హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో షర్మిల దీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ సాధించడం లక్ష్యంగా చేసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో నిరుద్యోగ నిరాహారదీక్ష నిర్వహించారు. జిల్లా సమన్వయ కమిటీ నాయకులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. వైయస్ షర్మిల నిరుద్యోగ నిరాహారదీక్షలో చాలా మంది నిరుద్యోగులు పాల్గొని షర్మిల దీక్షకు మద్దతు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ నుండి పట్టభద్రులైన అనేకమంది నిరుద్యోగులు షర్మిల దీక్షలో పాల్గొన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈరోజు దీక్షను నిర్వహించినట్లు గా తెలుస్తుంది.
నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్న షర్మిల
ప్రతి మంగళవారం ఒక్కో జిల్లాలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ వైయస్ షర్మిల ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో అనేక జిల్లాలలో నిరాహార దీక్షలు చేపట్టిన షర్మిల సీఎం కేసీఆర్ తెలంగాణ నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని, నిరుద్యోగ సమస్యలు గాలికి వదిలేసి, ప్రగతి భవన్ లో ప్రశాంతంగా కూర్చున్నారని అనేకమార్లు షర్మిల విమర్శించిన విషయం తెలిసిందే. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అవేవి పట్టనట్టు, సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో షర్మిల ధ్వజమెత్తారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదు
ఈ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న షర్మిల సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కెసిఆర్ సర్కార్ స్పందిస్తుందని వైయస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడానికి, వారికి భరోసా ఇవ్వడానికి రంగంలోకి దిగిన షర్మిల తాను పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ మెడలు వంచే వరకు తమ పోరాటం
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకూ తన దీక్షలు కొనసాగుతాయని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మెడలు వంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు. ఇంకా ఎంత మంది చనిపోతే సీఎం కేసీఆర్ స్పందిస్తారో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి బోడ సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోలేదని వైయస్సార్టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కెసిఆర్ పై మండిపడ్డారు.
నిరుద్యోగుల పక్షాన షర్మిల పోరాటం .. కేసీఆర్ సర్కార్ పై సమరం
అంతకు ముందే అనేకసార్లు నిరుద్యోగుల చావుకు కారణం నిరుద్యోగం, నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు, నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆమె ఘంటాపథంగా చెప్పారు. నిరుద్యోగుల చావులకు కారణమవుతున్న కెసిఆర్ ముఖ్య మంత్రి పదవికి అనర్హుడు అంటూ షర్మిల ధ్వజమెత్తారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కోసం పోరుబాట పట్టిన షర్మిల ప్రతివారం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయాలని చేస్తున్న నిరాహార దీక్షలు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కొనసాగుతుందని షర్మిల ధ్వజమెత్తారు.