జనసేన ‘జన వాణి’: అర్జీల స్వీకరణ, అధికారులకు పంపి
జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి జనవాణి పేరుతో కార్యక్రమం నిర్వహించనుంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. వాటిని సంబంధిత అధికారులకు పంపించారు. సమస్య పరిస్కరించాలని కోరతారు. 'జన వాణి'లో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ కల్యాణ్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలు స్వీకరిస్తారు.
జులై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో తొలి విడత 'జన వాణి' నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో ఆదివారం కూడా విజయవాడలోనే 'జన వాణి' ఉంటుందని జనసేన పార్టీ వెల్లడించింది. ఆపై ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో జన వాణి ఉంటుంది. విజయవాడలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటారు. పవన్ కల్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తారు. ఆ రోజు సాయంత్రానికి ఆ సమస్యలను సంబంధిత అధికారులకు చేరేట్టు ప్రయత్నిస్తారు. ఆపై, తమ కార్యాలయం నుంచి ఆ అర్జీల పురోగతిని ఫాలో అప్ చేస్తారు.
సామాన్యుడికి న్యాయం జరిగేలా కార్యక్రమం రూపొందించామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్తో చెప్పుకుంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని బలపరిచే విధంగా 'జన వాణి' కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు.
జనసేన కార్యాలయం నుంచి అర్జీలను ఫాలోప్ చేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రతీ ఆదివారం జనవాణి కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి రెండు ఆదివారాలు జనవాణి కార్యక్రమాలు విజయవాడలో జరుగుతాయన్నారు. తర్వాత మాత్రం జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఆ మేరకు పార్టీ ప్రణాళిక సిద్దం చేసింది.