ఏజెంట్ దురాగతం.. సౌదీలో చిక్కుకుపోయిన అక్కచెల్లెళ్లు! సుష్మా స్వరాజ్ సాయం కోసం వినతి
హైదరాబాద్: గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు ఎంతోమంది యువతులు బలైపోతూనే ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువతులు 2017 ఫిబ్రవరి 5 నుంచి సౌదీ అరేబియాలో చిక్కుకుపోగా, ఎలాగైనా వారిని స్వదేశానికి చేర్చాల్సిందిగా వారి చెల్లెలు ఫర్హానా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కోరుతోంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్కు చెందిన రెహనా, నూర్ అనే యువతులు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. వారిని అక్కడికి పంపించిన ఏజెంట్ మక్సూద్ అక్కడ అల్ ఖాసీంలోని ఓ బ్యూటీపార్లర్లో పని చేయాల్సి ఉంటుందని చెప్పాడు.
నెలకు రూ. 1200 సౌదీ రియాల్స్ (మన కరెన్సీలో రూ. 20 వేలకుపైగా) జీతం ఇస్తారని చెప్పడంతో తమ కుటుంబ కష్టాలు తీరతాయనే ఉద్దేశంతో పాపం రెహనా, నూర్ అక్కడికి వెళ్లారు. తీరా వెళ్లాక నెలకు ఒక సౌదీ రియాల్ (రూ.17 ) జీతంగా ఇస్తారని తెలియగానే వారికి తాము మోసపోయామని అర్థమైపోయింది.
అక్కడ వారిని పనికి కుదుర్చుకున్న యజమానులు బలవంతంగా వారిచేత తమ ఇళ్లలో పని చేయిస్తుండడం, శారీరకంగా హింసిస్తుండడంతో.. సౌదీలో తామెదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వారు ఎలాగో హైదరాబాద్లోని తమ చెల్లెలు ఫర్హానాకు తెలియజేశారు.
దీంతో తన అక్కలను క్షేమంగా స్వదేశానికి ఎలా చేర్చాలో తెలియక ఫర్హానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన అక్కలిద్దరికీ వారి యజమానులు సరిగా తిండి కూడా పెట్టడం లేదని, తమతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చేశారని, ఎంతోమందికి సాయపడుతున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఎలాగైనా తన అక్కలు స్వదేశం చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.