శశికళ ముందు పెనుసవాళ్లు: దీప, స్టాలిన్లతో చుక్కలే!
ఒకటీరెండ్రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ముందు పెనుసవాళ్లే ఉన్నాయి.
చెన్నై: ఒకటీరెండ్రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ముందు పెనుసవాళ్లే ఉన్నాయి. శాసనసభకు ఎన్నిక కావటం తక్షణ సవాలుకాగా ప్రతిపక్షాన్ని జయ స్థాయిలో ధీటుగా ఎదుర్కొనవలసి ఉండటం ప్రతిష్ఠాత్మకం కానుంది. రెండు నెలలుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పన్నీర్సెల్వం పొందిన ప్రజాదరణ ఆమెకు ఇబ్బందికరంగానే పరిణమించే అవకాశం ఉంది.
జయ మృతి అనంతరం నెలకొన్న సానుభూతి నేపథ్యంలో ఇంతకాలం ఆచితూచి అడుగేసిన ప్రతిపక్షం.. ఇప్పుడు ఎదురుదాడికి దిగే అవకాశం లేకపోలేదు. ఆమె ఎన్నికను తాము అంగీకరించలేమని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే.. జయలలితకు అసలైన వారసురాలిగా పేర్కొంటూ రాజకీయాల్లోకి వస్తున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్ నుంచి గట్టి సవాలే ఎదురుకానుంది. శశికళ పోటీ చేసే నియోజకవర్గం నుంచే తాను కూడా పోటీ చేస్తానని దీప ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పు ఆసక్తికరంగా మారనుంది.
స్టాలిన్
శశికళను జయ స్థానంలో ఎన్నుకున్న ఈ రోజు తమిళనాడు చరిత్రలో చీకటి రోజుగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ అభివర్ణించారు. డీఎంకే వంటి ప్రతిపక్షాలు, వారిని బలపరిచే ప్రజల మద్దతు చూరగొనడం, పార్టీలో ప్రత్యర్థి వర్గాలు వేలెత్తి చూపని విధంగా పరిపాలనను కొనసాగించడం శశకళకు కత్తిమీద సామేనని చెప్పవచ్చు.
శశికళను వ్యతిరేకిస్తున్న బిజెపి
పార్టీ పదవులలో తన మద్దతుదారులను నియమించుకుని తనకు అడ్డు లేకుండా చేసుకున్నారని, పరిపాలనలోనూ అనుకూలురైన అధికారులను నియమించే దిశగా ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ వంటి వారితో ముందుగా రాజీనామా చేయించారని చెబుతున్నారు. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పరిపాలన సాగిస్తున్న పన్నీరుసెల్వాన్ని హఠాత్తుగా మార్చడంలో అర్థం లేదని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ పార్టీకి కూడా శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇష్టం లేదనే చర్చ కొనసాగుతోంది.
పన్నీరు సెల్వంకేకే బీజేపీ మద్దతు
తొలినుంచి పన్నీరుసెల్వానికి మద్దతు తెలిపి సహకరిస్తున్న కేంద్రం నుంచి అదే విధమైన మద్దతు సంపాదించడం కూడా శశికళకు సవాలు కానుంది. జయలలిత మృతి ప్రకటన వెలువడటానికి కొన్ని గంటల ముందు అపోలో ఆసుపత్రికి శాసనసభ్యులను పిలిపించి శశికళను అనుకూలంగా సంతకాలను సేకరించారని, ఈ సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి జోక్యంతో పన్నీర్సెల్వం బాధ్యతలు స్వీకరించారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో శశికళకు బీజేపీ నుంచి కూడా పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
దీపా జయకుమార్
జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గంలోనూ పోటీ చేసి గెలవడం అంత సులువు కాదని భావిస్తున్నారు. ప్రతిపక్షాలతో పాటు పార్టీలోని వ్యతిరేక వర్గం, ముఖ్యంగా అక్కడే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న దీప అనుచరగణం, జయ మరణం వెనుక శశికళ హస్తం ఉందనే ఆరోపణలను విశ్వసిస్తున్న వారిని ఎదుర్కొనడం కష్టం కానుందని చెబుతున్నారు. ఒక వేళ ఆర్కేనగర్ నియోజకవర్గంలో దీపపై పోటీ చేసి గెలిస్తే తప్ప శశికళ నాయకత్వంపై స్పష్టం వచ్చే అవకాశం లేదు.