శబరిమల అయ్యప్ప దర్శనం కోటాను 50 వేలకు పెంచాలంటూ వినతి: ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఇలా
తిరువనంతపురం: కేరళలోని శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు వెళ్తుంటారు. మండలం-మకరవిళక్కు సీజన్లో శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటక, తమిళనాడుల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదివరకట్లా లక్షల సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు.
వర్చువల్ క్యూ విధానంలో..
కోవిడ్ 19 వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రొటోకాల్స్ను పాటిస్తోంది. వాటిని కఠినంగా అమలు చేస్తోంది. ఈ పరిణామాలతో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను నియంత్రించడానికి దేవస్వొం బోర్డు అధికారులు ప్రత్యేకంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. వర్చువల్ క్యూ విధానంలో భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తోన్నారు. ఈ విధానాన్ని మరింత సరళీకరించారు అధికారులు.
కోటా పెంపు..
ఇదవరకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య 45 వేలకు పరమితమై ఉండేది. దీన్ని 50 వేలకు పెంచాలంటూ ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవస్వొం బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. శబరిమలకు వచ్చిన ఏ భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకోకుండా వెనుదిరిగి వెళ్లకూడదనే ఉద్దేశంతో కోటాను పెంచాలని కోరినట్లు చెప్పారు. నీలిమల, అప్పాచిమేడు మార్గాలను కూడా త్వరలోనే తెరవాలని నిర్ణయించామని అన్నారు.
టీటీడీ తరహాలో..
కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో వెలిసిన శ్రీవారి దర్శనం కోసం ఏరకంగానైతే ఆన్లైన్ ద్వారా అడ్వాన్స్డ్గా టికెట్లను బుక్ చేసుకుంటారో.. సరిగ్గా అలాంటి వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై భక్తుల్లో అవగాహనను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా- టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలనే విషయంపై భక్తులకు అవగాహన కల్పించడానికి తమ అధికార యూట్యూబ్లో రెండు వీడియోలను పోస్ట్ చేశారు. పోలీసు అధికారుల సహాయ, సహకారాలను తీసుకున్నారు.
శబరిమల ఆన్లైన్ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే..
భక్తులు తొలుత https://sabarimalaonline.org/#/Videoguide లింక్ను క్లిక్ చేయాలి. అది ఓపెన్ కాగానే.. అందులో రెండు యూట్యూబ్ వీడియోలు లింకులు కనిపిస్తాయి. మలయాళంలో https://www.youtube.com/watch?v=WRn9sjJHivA&feature=youtu.be, ఇంగ్లీష్లో https://www.youtube.com/watch?v=YkNHjq7PaBM&feature=youtu.be అనే లింక్స్ ఉంటాయి. ఏ భాష తమకు అనుకూలంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు.
అసంపూర్ణ వివరాలు వద్దు..
ముందుగా రిజిస్టర్ అనే ఐకన్ను క్లిక్ చేయాలి. ఆ తరువాత అందులో అడిగిన విధంగా అన్ని వివరాలను పొందుపరచాలి. పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, జెండర్, తాము నివాసం ఉంటోన్న ఇంటి చిరునామా, రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం, జిల్లా లేదా నగరం, పిన్కోడ్ను అందులో పొందుపరచాలి. ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. భక్తులు తమ ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇమెయిల్ అడ్రస్ను కూడా వెల్లడించాలి. పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి.
మొబైల్కు ఓటీపీ
పాస్వర్డ్ను క్రియేట్ చేసుకున్న తరువాత.. మొబైల్ నంబర్కు వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) మెసేజీ రూపంలో అందుతుంది. ఆ ఓటీపీని అందులో పొందుపరచడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసినట్టవుతుంది. అనంతరం అదే పోర్టల్కు వెళ్లి.. లాగిన్ అవ్వాలి. తాము క్రియేట్ చేసుకున్న ఇమెయిల్, పాస్వర్డ్ను దీనికోసం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది భక్తులకు. లాగిన్ అయిన తరువాత ఎడమవైపు పైన చివరన ఉండే వర్చువల్-క్యూ అనే పదాలను క్లిక్ చేయాలి. సెల్ఫ్/కుటుంబం లేదా గ్రూప్ అనే పదాలను క్లిక్ చేయాలి. కుటుంబ సభ్యులుగా వెళ్లాల్సి ఉంటే నలుగురు భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది
గ్రూప్గా వెళ్లే భక్తుల కోసం..
గ్రూప్గా వెళ్లదలిచిన భక్తుల..ఆ అక్షరాలను క్లిక్ చేయాలి. యాడ్ పిలిగ్రిమ్స్ అనే అక్షరాల మీద క్లిక్ చేయడం ద్వారా ఎంతమంది గ్రూప్లో ఉన్నారనేది తెలియజేయాలి. ఆ భక్తులకు సంబంధించిన పూర్తి వివరాలు పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, జెండర్, నివాసం ఉంటోన్న ఇంటి చిరునామా, రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం, జిల్లా లేదా నగరం, పిన్కోడ్ను ఫొటోతో సహా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి.
స్వామివారి దర్శనం, సమయం..
ఫొటో గుర్తింపు కార్డును అప్లోడ్ చేసి, సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తరువాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ తాము ఏ తేదీ, ఏ సమయంలో అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవాలనేది క్లిక్ చేయాలి. ఆ రోజు కోటా అందుబాటులో ఉందా? లేదా? అనేది అక్కడే తెలిసిపోతుంది. ఆ తరువాత ప్రసాదానికి సంబంధించిన వివరాలు అక్కడే ప్రత్యక్షమౌతాయి. దాన్ని పూర్తి చేసిన తరువాత విష్ లిస్ట్ ఐకన్ను క్లిక్ చేయాలి.
వర్చువల్ కూపన్ రెడీ..
విష్ లిస్ట్ను క్లిక్ చేసిన తరువాత టికెట్ నమూనా కనిపిస్తుంది. శబరిమల వర్చువల్-క్యూ బుకింగ్ కూపన్ కనిపిస్తుంది. పంబ వద్ద రిపోర్టింగ్ చేయాల్సిన సమయం, తేదీ అవన్నీ అందులో చెక్ చేసుకోవచ్చు. భక్తులు తాము అందజేసిన వివరాలు అన్నీ మరోసారి చూసుకోవడానికి ఇక్కడ వీలు ఉంటుంది. సరిగ్గా ఉన్నాయని భావిస్తే.. కన్ఫర్మ్ అనే అక్షరాలను క్లిక్ చేయాలి. దీనితో ఈ ప్రాసెస్ ముగుస్తుంది. రిజిస్టర్ మొబైల్ నంబర్కు కన్ఫర్మేషన్ వివరాలు అందుతాయి.