చౌరస్తాలో తెలంగాణ: ఏం చేద్దాం?

Telangana
తెలంగాణ అంశం మళ్లీ చౌరస్తా మీద నిలబడింది. తెలంగాణ సాధనకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, రాజకీయ పార్టీలను నమ్ముకుని సాగిన వైనం ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదనే అవగాహనకు తెలంగాణ ప్రజా సంఘాలు వచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జెఎసి ఇప్పటి వరకు తాము చేసిన ఉద్యమాన్ని, ఉద్యమ కార్యాచరణను సమీక్షించుకుని, స్వతంత్రంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నది. కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏజెంటుగా కోదండరామ్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు దండిగానే వచ్చాయి.

అయితే, తెలంగాణ సాధన కోసం మాత్రమే పుట్టిన పార్టీగా తెలంగాణ జెఎసి తెరాసకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఇచ్చి ఉండవచ్చు. అయితే, మొత్తంగా తెలంగాణ ప్రజా సంఘాల ఉద్యమంలో ఏ తీవ్రమైన తప్పిదం ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి, తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాలు రాజకీయ పార్టీలపై, పార్టీల నాయకులపై పూర్తిగా ఆధారపడి కాకుండా సొంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉండింది. రాజకీయ పార్టీల ఎజెండాకు ప్రజా సంఘాలు ఊకొట్టడం కాకుండా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలకు ఎజెండా ఇవ్వాల్సి ఉండింది. ఒక రకంగా ఒత్తిడి రాజకీయాలను మేధావులు, రచయితలు, విద్యావంతులు, విద్యార్థులు పెట్టుకుని ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. మొత్తంగా రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎజెండాల చుట్టూ వీరు పరిభ్రమించారని చెప్పాలి.

రాజకీయ పార్టీలు తప్పుదారి పడుతున్నాయని భావించినప్పుడు ఒక హెచ్చరికలాంటిది చేసే వెసులుబాటును ఉంచుకోవాల్సి ఉండింది. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో రెండు తెలంగాణ రాజకీయ పార్టీలు పోటీ చేసినప్పుడు తటస్థంగా రాజకీయ జెఎసి వ్యవహరించింది. పరకాల ఉప ఎన్నిక విషయంలో అదే పరిస్థితి వచ్చేసరికి తటస్థంగా ఉండలేక సర్వే జరిపించి తెరాసకు మద్దతు ప్రకటించింది. పరకాలలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై తాము తీవ్ర అయోమయంలో పడ్డామని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి జెఎసి నాయకుడు రాజేష్ ఆదివారం జరిగిన సింగిడి తెలంగాణ రచయితల సంఘం సమావేశంలో అన్నారు. దీన్నిబట్టి చూస్తే ఒక అయోమయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఇటు తెరాస, అటు బిజెపి సృష్టించి తెలంగాణ అంశానికి రెండో ప్రాధాన్యం మాత్రమే ఇచ్చాయనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది.

తెలంగాణ ఉద్యమం విషయంలో తెలంగాణ జెఎసి గానీ తెలంగాణ విద్యావంతుల వేదిక గానీ సాధించిన ఫలితాలు చిన్నవేమీ కావు. కానీ, కార్యాచరణలో కాస్తా అప్రమత్తంగా వ్యవహరించి ఉండాల్సింది. మహబూబ్‌నగర్‌లో పోటీకి రెండు పార్టీలు సిద్ధపడినప్పుడే రాజకీయ పార్టీలతో తెగదెంపులు చేసుకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అయితే, అలా చేసుకోకపోవడానికి దానికి ఉండాల్సిన కారణాలు దానికి ఉన్నాయి. తెలంగాణ కోసం పనిచేస్తున్న పార్టీలను కాదంటే సమైక్యవాదులు బలపడుతారనే భయం జెఎసికి ఉండవచ్చు. ఆ భయాన్ని తెరాస, బిజెపి వాడుకున్నాయని చెప్పాలి. ఒక సానుకూలమైన భయాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న పార్టీలు ఇప్పుడు దాని మనుగడను దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాజకీయ పార్టీల పట్ల మిత్ర వైఖరిని ప్రదర్శిస్తూ, సమీప దూరాన్ని పాటించాల్సి ఉండింది. అయితే, తెలంగాణ జెఎసి ఏర్పాటు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన మలుపు. తెలంగాణ ప్రజాశ్రేణులకు ఆకాంక్ష చుట్టూ రాజకీయ పార్టీలను తిరిగేలా చేసిన ఘనత దానికే తగ్గుతుంది. తెలంగాణ జెఎసికి ప్రజల నుంచి లభించిన నైతిక మద్దతును తెరాస వాడుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఓట్ల నుంచి ఓట్ల వరకు సాగిన తెరాస ఉద్యమానికి తెలంగాణ జెఎసి ఒక ఆలంబనగా నిలిచింది.

అయితే, తెలంగాణ జెఎసి తెలంగాణకు చెందిన వివిధ శ్రేణులను సంఘటితం చేసింది. నిజానికి, ఏ వర్గానికి చెందిన వర్గం ఆ వర్గంగా సంఘటితమైంది. ఈ సంఘటతమైన శ్రేణులను తెలంగాణ జెఎసి తన గొడుగు కిందికి తెచ్చుకోవడంలో సఫలమైంది. అయితే, ఇంకా మరింత విస్తృతిని తెలంగాణ ఉద్యమానికి కల్పించాల్సిన అవసరం ఉంది. నిజానికి, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ చేస్తున్న ప్రకటనలు, కాంగ్రెసు అధిష్టానం కదలికలను చూస్తుంటే తెలంగాణ మరోసారి మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలో మరింత విశాల ప్రాతిపదికపై తెలంగాణ మేధావులను, రచయితలను సంఘటితం చేయాల్సిన బాధ్యతను తెలంగాణ జెఎసి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- కె. నిశాంత్

(రచయిత అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. విభేదించే వారు గానీ సమర్థించేవారు గానీ తమ అభిప్రాయాలు రాస్తే ప్రచురిస్తాం. అభిప్రాయాలు వ్యాసాల స్థాయిలో ఉండాలని మనవి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+