రాజకీయాల్లో జెపి ఫెయిల్యూర్: పవన్ నేర్చుకుంటారా?
హైదరాబాద్: దేశానికి స్వతంత్రం వస్తే తమ ఊరి కానిస్టేబుల్ బదిలీ అవుతాడా అని మహాకవి గురజాడ రాసిన కన్యాశుల్కంలోని ఓ పాత్ర అడుగుతుంది. ఆ ప్రశ్న అమాయకంగా కనిపిస్తుంది. మేధావులకు, కాస్తా చదువుకున్నవాళ్లకు నవ్వు కూడా తెప్పిస్తుంది.
కానీ ఆ ప్రశ్నలోని అంతరార్థాన్ని గ్రహిస్తే ప్రజలు ఏం కోరుకుంటారనేది అర్థమవుతోంది. జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోకసత్తా రాజకీయాల్లో విఫలం కావడాన్ని ఆ కోణం నుంచే చూడాల్సి ఉంటుంది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని వైఫల్యంగానే చూడాలి.
తాము ఎన్ని జీవోలు తెప్పించామో, వాటి కోసం ఎంతగా ఉద్యమం చేశామో తనకు తెలుసునని జెపి అంటారు. అందులో నిజం ఉండవచ్చు. కానీ వాటిని ప్రజలు గ్రహించలేదు. గ్రహించలేదనే కన్నా గుర్తించలేదు. దాని కన్నా వాటి ఫలితాలు తాము అనుభవిస్తున్నామనే ఎరుక వారికి కలుగలేదు.
రాజకీయాల్లో చేయడం కన్నా చేసినట్లు కనిపించడం, నమ్మించడం చాలా అవసరం. అయితే, అది సంప్రదాయ రాజకీయ పార్టీల పంథా అని, తాము కొత్త మార్గంలో పయనిస్తున్నాం కాబట్టి ఆ అవసరం తమకు లేదని జెపి అనవచ్చు. కానీ, మార్పు తీసుకు రావాలని భావించే నాయకుడు ఆ పని కూడా చేయాలి.
నిజానికి, జెపిపై యువత చాలా ఆశలు పెట్టుకుంది. 2009 ఎన్నికల్లో ఆ జెపి లోకసత్తా ప్రభావం కనిపించింది. అది ఓట్ల ద్వారా ఆ పార్టీ సత్తా చాటేంతంగా లేకపోవచ్చు గానీ ప్రభావం మాత్రం గణనీయంగానే ఉందని అప్పటి ఎన్నికల సరళిని పరిశీలించినవారు గ్రహించారు. కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఓటమికి జెపి పరోక్షంగా కారణమయ్యారనేది కూడా వాస్తవమే.
అయితే, చాలా నిర్దిష్టంగా, స్థానిక స్థాయిలో ఓ పార్టీ తెచ్చే మార్పు ప్రభావం కనిపించాలి. దాని ఫలితాలు కూడా అదే స్థాయిలో కనిపించాలి. అమూర్తమైన ఆదర్శాలు చెప్పడం వల్ల, వాటిని ఆచరించాలని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు రాజకీయాలను, సమాజాన్ని, వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవాలని చెప్పడం అందరికీ నచ్చుతుంది. కానీ ఆచరణలో వ్యక్తులు వాటిని ఏ మేరకు ఆచరిస్తారనేది ప్రశ్న.
పైగా, ఆచరించాల్సిన అవసరం మాత్రమే వెసులుబాటు కూడా వ్యవస్థల్లో లేరు. పైగా, వ్యక్తి సోమ్ము కూడబెట్టడమే ముఖ్యం గానీ అది ఎలా కూడబడుతున్నాడనేది సమాజానికి పనికి రాదు. ఎలా కూడబెడితేనేం వాడు అభివృద్ధి చెందాడు కదా అనే మాట బాహాటంగానే వినిపించే దశలో ఉన్నాం.
పైరవీలు చేయడానికి ఇష్టపడనివారు మాత్రమే కాదు, అవి ఎలా చేయాలో, లంచాలు ఏ మార్గంలో ఇవ్వాలో తెలియని వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యం కాక మానదు. ఇటువంటివారు దాదాపుగా ప్రధాన స్రవంతి సమాజానికి పనికి రానివారుగానే పరిగణనలోకి వస్తున్నారు. అటువంటి వారి జాబితా ఒకటి జెపి వద్ద ఉంటే ఆయన బహుశా ఫలితాలు ఇంకా మెరుగ్గా సంపాదించి ఉండేవారేమో.
మార్పు రాదని అనడం కూడా నిరాశావాదమే అవుతుంది. అ నిరాశలో కొట్టుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ, ఆ మార్పుకోసం పనిచేసే సంస్థను, రాజకీయ పార్టీని బలంగా ఉన్న సంస్థ, రాజకీయ పార్టీ మింగేస్తుంది. ఎన్టీ రామారావు మాట రామబాణంగా ఉండేది. ఆయనకు ఎదురు చెప్పడానికి ఎంతటివారైనా భయపడేవారు. కానీ, ఆయనను కూడా రాజకీయాలను అత్యంత దారుణంగా దూరం చేసిన రాజకీయ వ్యవస్థ ఉంది.
ఎన్టీ రామారావుతో పోలిస్తే అంత ఇమేజ్ గానీ, అంత సత్తా గానీ జెపికి లేదు. జెపి లోకసత్తా విషయంలో కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కున్నారు. అవతలి శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించని కారణంగా లోకసత్తాను చీల్చే ప్రయత్నం కూడా జరిగింది.
అదలా వుంటే, జెపి ఉద్దేశించిన మార్పును ఆచరణలో మరింత నిర్దిష్టంగా, మరింత స్థానికంగా అనుభవంలోకి తేవాల్సి ఉండింది. అంతేకాదు, ఆయనపై కుల మచ్చ కూడా పడింది. ప్రాంతీయ మచ్చ పడింది. సామాజికంగా కమ్మ వర్గానికి చెందినవాడిగా, ప్రాంతీయంగా తెలంగాణ వ్యతిరేకిగా ఆయనపై ముద్ర పడింది. అలా పడడానికి ఆయన తాను ఉద్దేశించిన ఆదర్శాలను స్థానికమూ మూర్తమూ చేయకపోవడం వల్లనే జరిగింది. విశ్వజనీన ఆదర్సాలు, సత్యాలు ఏవి కూడా వర్తమాన కాలంలో పనికి రావు.
ఆ కారణంగా జెపి అన్ని కులాలకు ప్రతినిధిగా, తెలుగు సమాజంలోనైనా సరే, అన్ని ప్రాంతాలకు ప్రతినిధిగా కనిపించలేకపోయారు. అలా అనకంటే అన్ని ప్రాంతాలు, కులాలు సమానంగా ఆయనను స్వీకరించలేదు. ఇందుకు ఆయన ఆయా కులాలవారిని, ఆయా ప్రాంతాల వారిని తప్పు పట్టవచ్చు. కానీ, ఆ కులాల, ప్రాంతాల విమర్శల వెనక ఉన్న సత్యమేమిటనేది ఆయన గ్రహించలేకపోయారు.
చిరంజీవి ప్రజారాజ్యం వైఫల్యం వెనక కూడా అటువంటి కారణమే ఉంది. తెలంగాణ సమస్యకు గానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు గానీ ఆయన నిర్దిష్టమైన మార్గం చూపించలేకపోయారు. వాటిపై స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ చేసిన పని కూడా అదే. అయితే, ఆయన ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కనీసం ప్రతిపక్షంలోనైనా ఉండడానికి, తెలుగుదేశం పార్టీకి సవాల్ విసరడానికి ఇతర కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు.
మొత్తం మీద, రాజకీయాల నుంచి ఆయన ఉపసంహరణ పెద్ద తప్పిదమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ వైఫల్యం నుంచి పాఠం తీసుకుంటారా, చూడాలి.
- కె. నిశాంత్