ద్రావిడ్ను ఫిక్స్ చేసిన కుంద్రా, శిల్పా లక్ష పందెం?
న్యూఢిల్లీ: ఐపియల్ బెట్టింగ్ వ్యవహారంలో ఒక్కొటొక్కటే విషయాలు బయపడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్పై కూడా బురద పడుతోంది. ఆ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రా జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ నుంచి మ్యాచ్లకు సంబంధించిన వివరాలు తెలుసుకుని బెట్టింగ్కు పాల్పడేవాడని అంటున్నారు. ఫ్రాంచైజీ భాగస్వామి అయినందున కుంద్రాకు టాస్, పిచ్, జట్టు వ్యూహం తదితర విషయాల్ని ద్రావిడ్ తెలియజేసేవాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ద్రావిడ్కు బెట్టింగు వ్యవహారం తెలియదని పోలీసులు అంటున్నారు. కుంద్రా మాదిరే చెన్నై టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ కూడా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ద్వారా సమాచారం తెలుసుకుని విందూ సింగ్కు చేరవేసేవాడని అంటున్నారు.

రాజ్ కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఓ మ్యాచ్ లో లక్ష రూపాయలకు పందెం కాసినట్టు ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఐపీఎల్-4లో 50 లక్షలు, ఐదో సీజన్లో 40 లక్షలు, ఆరో ఎడిషనల్లో 12.5 లక్షల రూపాయలు నష్టపోయినట్టు కుంద్రా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే, కుంద్రా మాటలు నమ్మేట్లు లేవని పోలీసులు చెప్పారు. ఆరో సీజన్లో రాజస్థాన్ 16 మ్యాచ్ల్లో 11 గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇదిలావుంటే, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో చిక్కుల్లోపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ఊరట లభించింది. బెట్టింగ్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై జట్టు ప్రిన్సిపాల్ గురునాథ్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ మధ్య ఆర్థిక లావాదేవీలు సాగినట్టు ఆధారాలు లభించలేదని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు. విందూ, గురునాథ్ బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
రాజ్ కుంద్రా కూడా బెట్టింగుకు పాల్పడినట్లు ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. కుంద్రా తాను బెట్టింగుకు పాల్పడినట్లు అంగీకరించినప్పటికీ అంతకు మించి ఆధారాలు లేవని అంటున్నారు. దీంతో రాజ్ కుంద్రా బెట్టింగు కుంభకోణం నుంచి బయటపడినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications