నిర్దాక్షిణ్యంగా వేటు.. కాస్ట్ కటింగ్ కూడా?: 'లే ఆఫ్స్'తో ఐటీ జీవులకు నిద్ర కరువు..
రోజురోజుకు లే ఆఫ్లు పెరిగిపోతుండటంతో.. ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు.
బెంగళూరు: నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు.. కిక్కురుమనకుండా పనిచేయాల్సిన అగత్యాన్ని కల్పిస్తున్నారు.. పని గంటలు పెంచినా.. సౌలభ్యాల్లో కోత విధించినా.. అన్నీ భరిస్తూ దినదిన గండంగా కాలం వెళ్లదీయడమే ఇప్పుడు ఐటీ జీవుల మనుగడ అయిపోయింది.
ఐటీకి ఏమైంది?: కెరీర్పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..
ఒకప్పుడు లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అయిన ఐటీ రంగం.. ఇప్పుడు ఒడిదుడులకే ఎక్కువగా పరిమితమవుతోంది. ఉద్యోగం ఊడిపోతే ప్రత్యామ్నాయం కూడా లేకుండా చేసే ఫైర్ ఎగ్జిట్(పనితీరు సరిగా లేదని) చాలామంది జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగులను తగ్గించుకుంటున్న కంపెనీలు.. ఉన్నవారిపై విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయి.
కాస్ట్ కటింగ్:
ఐదంకెల జీతం.. వారంతాపు సెలవులు.. ఇంటి వద్దకే వచ్చి పికప్ చేసుకునే క్యాబ్ సర్వీసులు.. ఇలా ఐటీ లైఫ్ అంటే ఇవన్నీ గుర్తుకురావడం కామన్. కానీ పరిస్థితిలో వేగంగా మార్పు వచ్చింది. కాస్ట్ కటింగ్'తో ఇప్పుడీ లగ్జరీకి కోతలు తప్పట్లేదు.
కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో నష్టాలు చవిచూస్తున్న ఐటీ కంపెనీలు.. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగుల తొలగింపుతో పాటు కాస్ట్ కటింగ్ ను అవలంభిస్తున్నాయి. దీంతో ఒకప్పుడు ఓ స్థాయిలో వెలిగిపోయిన ఐటీ జీవితాలు.. ఇప్పుడు మిణుకు మిణుకుమనే దశకు చేరుకుంటున్నాయి.
సాఫ్ట్ వేర్ అల్లుడా?.. వద్దు బాబోయ్: కాలం మారింది.. ఐటీ 'కళ' చెదిరింది
పెళ్లిళ్లు కూడా రద్దయ్యే పరిస్థితి:
ఒకప్పుడు ఐటీలో కొలువంటే.. మరో మాట లేకుండా పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేవారు. ఇప్పుడలా లేదు. ఐటీ ఒడిదుడుకులతో ఉద్యోగ భద్రత కరువవడంతో పిల్లనివ్వడానికి కూడా చాలామంది వెనుకాడుతున్న పరిస్థితి. ఇటీవల ఐటీ కంపెనీలు చాలామంది ఉద్యోగులను తొలగించుకున్న నేపథ్యంలో.. వారందరిదీ ఇదే దుస్థితి.
పెళ్లయ్యాక ఉద్యోగం పోగొట్టుకుని సూటిపోటి మాటలతో వేదనకు గురవుతున్నారు కొంతమందైతే.. ఏకంగా పెళ్లిళ్లే రద్దయిపోయినవాళ్లు మరికొంతమంది. ఒకప్పుడు ఇంటిల్లిపాదీని తమ సంపాదనతోనే పోషించిన ఐటీ ఉద్యోగులు.. ఇప్పుడు తాము బతకడానికే మరో ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పని ఒత్తిడి..:
ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగులను తొలగించుకుంటున్న కొన్ని కంపెనీలు.. అదే సమయంలో ఉన్న ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేస్తున్నాయి. ఏకంగా 12-17గం. పాటు వారితో పనిచేయిస్తూ కనీస నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే.. ఎక్కడ ఉద్యోగం ఊడుతుందోనన్న అభద్రతా భావం ఐటీ జీవులను వెంటాడుతోంది.
ఉద్యోగం నుంచి తొలగించే ముందు కనీసం మూడు నెలల ముందుగానే సమాచారం ఇవ్వాలన్న నిబంధన ఉన్నా.. ఐటీ కంపెనీలకు మాత్రం అదేమి పట్టడం లేదు. అలాగే కనీసం మూడు నెలల జీతం ఇవ్వాలన్న ఉద్యోగుల విన్నపాన్ని కూడా కంపెనీలు పట్టించుకునే పరిస్థితి లేదు.
లక్ష ఉద్యోగాలు గాయబ్:
ఐటీ ఒడిదుడుకుల కారణంగా దేశవ్యాప్తంగా లక్ష మంది తమ ఉద్యోగాలను కోల్పోగా.. అందులో 35వేల మంది ఒక్క బెంగుళూరులో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కావడం గమనార్హం. రోజురోజుకు లే ఆఫ్లు పెరిగిపోతుండటంతో.. ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. దీనిపై కర్ణాటక ఐటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కుమారస్వామి శనివారం రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గెను కలిసి వినతిపత్రం అందజేశారు.