కెసిఆర్ ఆకర్ష్: విజయారెడ్డి సహా ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్ : వచ్చే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో పాగా వేయడానికి తెలంగాణ రాష్ట్ర్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చెందిన నగర నాయకులకు ఆయన గాలం వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వివిధ నాయకులు ఆదివారంనాడు కెసిఆర్ను కలిశారు.
హైదరాబాద్లో తెరాస బలహీనంగా ఉంది. దీంతో కెసిఆర్ ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానించడం ద్వారా బలం పుంజుకోవాలని ఆలోచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ను అమలు చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది. ఆదివారం పార్టీ సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు నివాసంలో పార్టీ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. పేరుకు ఇది స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశమని చెబుతున్నా ఇందులో కీలకమైన అంశాలపై చర్చజరిగినట్టు తెలిసింది.
ఈ సమావేశానికి కెసిఆర్తో పాటు డిపూటీ సీఎంలు మహమూద్ అలీ, టి.రాజయ్య, మంత్రులు హరీశ్రావు, టి.పద్మారావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు కడియం శ్రీహరి, కవిత తదితరులు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో అన్ని జిల్లాల్లో పార్టీని పటిష్ఠం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది.
నవంబర్లో జీహెచ్ఎంసి పాలకవర్గం పదవీ కాలం పూర్తవుతోంది. దీంతో ఆ ఎన్నికలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో తమ పట్టును సాధించుకోవాలని, మేయర్ పదవిని దక్కించుకోవడానికి పార్టీని పటిష్ఠమైన శక్తిగా రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగానే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసులకు చెందిన కీలక నాయకులను పార్టీలోకి ఆహ్వానించి వారికి కీలక బాధ్యతలు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
టిడిపికి సంబంధించి నగరంలో కీలక నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, పదిహేను మంది కార్పొరేటర్లు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనితెరాస వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. వీరితో పాటు మజ్లిస్పార్టీలోని కొందరు కార్పొరేటర్లు కూడా తెరాసలో చేరేందుకు సిద్ధంగా ఉనట్టు తెలిసింది.
విజయా రెడ్డి ఇలా...
తెరాస సీనియర్ నేత కె. కేశవరావు నివాసంలో ఏర్పాటైన సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు విజయారెడ్డి వచ్చారు. ఆమె మాజీ మంత్రి దివంగత పి. జనార్దన్ రెడ్డి కూతురు. జనార్దన్ రెడ్డికి హైదరాబాదలో మంచి పేరు ఉంది.
పార్టీ నాయకులు ఇలా...
కె. కేశవరావు నివాసానికి ఇతర పార్టీల నాయకులు ఇలా వచ్చారు. వారు తెరాసలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.
సమావేశంలో ఇలా...
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇలా ఫొటోకు ఫోజులిచ్చారు. ఆయన ఆకర్ష్ మంత్రం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
కెకె నివాసంలో ఇలా...
ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా కేశవ రావు నివాసంలో ఏర్పాటైన సమావేశానికి వచ్చిన కెసిఆర్ రాజకీయ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.
కెసిఆర్ వ్యూహరచన
వచ్చే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలపై కెసిఆర్ దృష్టి పెట్టి కేశవరావు నివాసంలో ఏర్పాటైన సమావేశాన్ని వాడుకున్నట్లు చెబుతున్నారు.
కేశవ రావు కీలక పాత్ర
తనకు ఉన్న సంబంధాల ద్వారా కేశవరావు, కెసిఆర్ కలిసి హైదరాబాదులో తెరాసను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.