దీవించారు: కెసిఆర్ చేతిలో టి-టిడిపి నేత భవిష్యత్తు!
ఢిల్లీ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు, వరంగల్ సీనియర్ రాజకీయ నాయకురాలు గుండు సుధారాణి తన రాజకీయ జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతిలో పెట్టారట! బుధవారం ఆమె ఢిల్లీలో కెసిఆర్ను కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో మంతనాలు జరిపారు. ఆమె మాట్లాడుతూ... నా రాజకీయ జీవితం మీ చేతుల్లో పెడుతున్నానని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఆమెను సీఎం కెసిఆర్ ఆశీర్వదించారు. తుగ్లక్ రోడ్డులోని కెసిఆర్ నివాసంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను కలిశారు.
గుండు సుధారాణి టిడిపి ముఖ్యనేత. ఆమె నేడో, రేపో తెలుగుదేశం పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బుధవారం కెసిఆర్ను కలిసిన అనంతరం ఆమె మాట్లాడిన తీరు కూడా కారు ఎక్కే విధంగానే ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె రాజ్యసభ పదవికి మరో ఏడెనిమిది నెలలు ఉంది. ఈ నేపథ్యంలో పదవి ఉండగానే చేరితే... ఆ స్థాయిలో కాకపోయినా, మంచి పదవి దక్కించుకోవచ్చుననే ఉద్దేశ్యంతో ఆమె కారు ఎక్కుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిన్న కెసిఆర్ను కలిసిన అనంతరం మాట్లాడుతూ... తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతానా లేదా అనే విషయమై రాష్ట్ర ప్రజలే చూస్తారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలోనే తాను ముఖ్యమంత్రిని కలిశానని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అన్నారు.
తాను వరంగల్ ఉప ఎన్నిక, రాజ్యసభ గడువు ముగుస్తున్నందున టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాననే వార్తలను ఆమె కొట్టిపారేశారు. పదవులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమన్నారు. తాను చేరే విషయమై ప్రజలే చూస్తారన్నారు.