కెసిఆర్కు సవాల్: వరంగల్ లోకసభకు గద్దర్ పోటీ?
హైదరాబాద్: వరంగల్ లోకసభ స్థానం నుంచి ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన ప్రజాగాయకుడు గద్దర్ను పోటీకి దింపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు ఆయనను పోటీకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా విశేష ప్రజాదరణ ఉన్న గద్దర్ను పోటీకి దించితే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గట్టి సవాల్ విసిరినట్లు అవుతుందని వామపక్షాలు భావిస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా రావడంతో కడియం శ్రీహరి రాజీనామా చేయడం వల్ల వరంగల్ లోకసభ సీటుకు ఎన్నిక అనివార్యంగా మారింది.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు మల్లేపల్లి లక్ష్మయ్య, జనగాంకు చెందిన వైద్యుడు రాజమౌళి పేర్లను వామపక్షాలు పరిశీలిస్తున్నాయి. వీరి పేర్ల విషయంలో వామపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ గద్దర్ను పోటీకి దింపే విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
గద్దర్ను ఒప్పించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర వామపక్షాల నేతలు, ఆయన మిత్రులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్నికల బరిలోకి దిగడానికి గద్దర్ ఇష్టపడుతారా అనేదే సందేహం.