సంగ్మా రిజైన్, ఆమోదం: కూతురు అగాథది అదే దారా?
పోటీ చేయవద్దని సంగ్మాకు ఎన్సీపి నేతల నుండి ఒత్తిడి ఉందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల నుండి తప్పుకోవాలని లేదా చర్యలు తీసుకుంటామని ఎన్సీపి సంగ్మాను హెచ్చరించిందని చెప్పారు. తాను అనివార్య పరిస్థితులలోనే రాజీనామా చేసినట్లు పిఏ సంగ్మా చెప్పారు. ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని చెప్పారు. పోటీ నుండి తగ్గేది లేదన్నారు. పిఎ సంగ్మా రాజీనామా చేయగానే ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఆయన రాజీనామాను ఆమోదించారు.
తాను సంగ్మా రాజీనామాను వెంటనే ఆమోదిస్తున్నానని పవార్ తెలిపారు. తాము మేఘాలయ అసెంబ్లీ స్పీకర్కు సంగ్మా రాజీనామా విషయాన్ని తెలియజేస్తామని చెప్పారు. సంగ్మా మేఘాలయలో శాసనసభ్యుడిగా ఉన్నారు. సంగ్మా గతంలో లోకసభ స్పీకర్గా పని చేశారు. రాష్ట్రపతి బరిలో ఉన్న సంగ్మాకు ఇప్పటికే బిజెడి, ఎఐడిఎంకే మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి సంగ్మాను బరిలో నుండి తప్పిద్దామన్న పార్టీకి ఆయన కౌంటర్ ఇస్తూ రాజీనామా చేయడం గమనార్హం. పవార్ కూడా దానిని వెంటనే ఆమోదించడం విశేషం.
మరోవైపు పార్టీ సూచన మేరకు సంగ్మా రాష్ట్రపతి పోటీ నుండి తప్పుకుంటే బావుంటుందని ఎన్సీపి నేత, కేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్ అన్నారు. తమ పార్టీ ఇప్పటికే యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చేందుకు నిర్ణయించుకుందని చెప్పారు. సంగ్మా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయాన్ని అతను ప్రకటించే వరకు తమకు తెలియదన్నారు. ముందు తమను సంప్రదించలేదని చెప్పారు.
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిఎ సంగ్మా రాజీనామా చేయడం, ఆయన రాజీనామాను పవార్ ఆమోదించినప్పటికీ మరో విషయం చర్చనీయాంశమైంది. పిఎ సంగ్మా కూతురు అగాథా సంగ్మా కేంద్రమంత్రిగా ఉన్నారు. సంగ్మా మొండిగా పార్టీకి రాజీనామా చేసి మరీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడిన నేపథ్యంలో అతని తనయ అగాథాపై ఎన్సీపి ఏం నిర్ణయం తీసుకోనుందో అనే చర్చ జరుగుతోంది.
సంగ్మా అభ్యర్థిత్వాన్ని పార్టీ వ్యతిరేకించక ముందు అగాథా తన తండ్రి తరఫున ప్రచారం నిర్వహించారు. అయితే అగాథా పార్టీ నిర్ణయం ప్రకారం ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేస్తుందా, లేక తండ్రికి మద్దతు పలుకుతుందా, అలాకాక తండ్రి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడంతో అగాథాపై పార్టీ వేటు వేస్తుందా, ఆమె మంత్రి పదవి ఊడుతుందా, లేక తండ్రికి ఆమెకు సంబంధం లేదని పార్టీ మిన్నకుంటుందా లేదా ఆమెనే తన తండ్రి బాటలో పార్టీని వీడుతుందా అనేది త్వరలో తేలనుంది. ఎన్సీపి నేతలతో పవార్ గురువారం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి అగాథా సంగ్మా కూడా హాజరు కానున్నారు.