సంస్కరణలు నగారా: తలుపులు బార్లా తెరిచారు
అలాగే ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలనుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా, మార్కెట్ వర్గాలు మాత్రం సహజంగానే స్వాగతించాయి. వాల్మార్ట్ వంటి కంపెనీలు ఎప్పటినుంచో కోరుతున్నట్టుగా, చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర మంత్రిమండలి శుక్రవారంనాడు నిర్ణయం తీసుకున్నది. ఈ రంగంలో 51 శాతం మేర ఎఫ్.డి.ఐ.లను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
మల్టీ భ్రాండ్ రిటైలింగ్ రంగంలో ఇక ఎఫ్.డి.ఐ.లు పెద్ద ఎత్తున వస్తాయని యు.పి.ఎ. ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయంలో రాష్ట్రాలు తమ విచక్షణానుసారం తగిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయవచ్చునని కేంద్రం ప్రకటించింది. ఎఫ్.డి.ఐ.లను యు.పి.ఎ. భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ సహా పెక్కు రాజకీయపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది.
ప్రసార మాధ్యమాల విషయంలో కూడా ఎఫ్.డి.ఐ.లను అనుమతిస్తూ కేంద్రం మరొక నిర్ణయం తీసుకున్నది. ఇందులో దాదాపు 74 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తారు. ఈ విషయమై కూడా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ప్రసార మాధ్యమాలలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాయి.
విమానయాన రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కష్టాలలో ఉన్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించాలని కొన్నాళ్లుగా కోరుతున్న విషయం తెలిసిందే. ఎన్ని కష్టాలలో ఉన్నా తమను కేంద్రం ఆదుకోవాలని కోరడం లేదని, విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే చాలని మాల్యా కోరుతున్నారు. ఇప్పుడు కింగ్ ఫిషర్ కల నెరవేరినట్టే.
విదేశీ పెట్టుబడుల నిర్ణయంతో పాటు ఐదు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. ఆయిల్ ఇండియా, నాల్కో. హిందూస్తాన్ కాపర్, నైవేలీ లిగ్నైట్, ఎం.ఎం.టి.సి. మొదలైన సంస్థలలో తక్షణం పెట్టుబడులను ఉపసంహరిస్తారని తెలుస్తున్నది. వామపక్షాలతో పాటు యుపిఎ భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెసు కూడా ప్రభుత్వ చర్యను వతిరేకించాయి. ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెసు 72 గంటల గడువు ఇచ్చింది.