'రేప్లు తగ్గించాలంటే, గర్ల్స్కి 16 ఏళ్లకే పెళ్లి చేయాలి'
సినిమా, టీవీల ప్రభావంతోనే పిల్లలు ఇలా చెడు మార్గాలు పడుతున్నారని పేర్కొన్నాడు. జింద్ జిల్లాలో అత్యాచారానికి గురైందని భావిస్తున్న 16 ఏళ్ల ఓ దళిత బాలిక.. నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్న నేపథ్యంలో ఖాప్ పెద్దలు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో సంబంధమున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గత 28 రోజుల్లో హర్యానాలో జరిగిన తొమ్మిది రేప్ కేసులు నమోదుకావడం, అందులో అత్యధికంగా జింద్ జిల్లాలోనే జరగడం గమనార్హం.
స్త్రీ, పురుష నిష్పత్తిలో పెరిగిపోతున్న అంతరం వల్లే హర్యానాలో అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం(ఐద్వా) అభిప్రాయపడింది. అమ్మాయిలు తక్కువగా ఉండడంతో అబ్బాయిలకు వివాహాలు కావడం లేదని అందువల్లే ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఐద్వా వైస్ ప్రెసిడెంట్ జాగ్మతి సంగ్వాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 830మంది మాత్రమే మహిళలున్నారని వివరించారు.
బాలికలపట్ల వివక్షతో హర్యానాలో భ్రూణ హత్యలు కూడా పెరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలు జరిగిన సందర్భాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా బాలికల తల్లిదండ్రులను మరింత అవమానపరిచేలా ఉంటోందని సంగ్వాన్ ఆరోపించారు. కాగా, హర్యానాలో మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలపట్ల జాతీయ బాలల హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంది. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి ఒక్క కేసుకు విడివిడిగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.